Landmine Threats: 'ఇండియాలో ఆ రాష్ట్రాలకు వెళ్లొద్దు'- కెనడా ట్రావెల్ అడ్వైజరీ, భారత్ స్ట్రాంగ్ కౌంటర్!

ABP Desam   |  Murali Krishna   |  29 Sep 2022 01:36 PM (IST)

Landmine Threats: కెనడా తాజాగా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

కెనడా ట్రావెల్ అడ్వైజరీ, భారత్ స్ట్రాంగ్ కౌంటర్!

Landmine Threats: కెనడా తన పౌరులకు ఇటీవల ఓ విచిత్రమైన ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్థాన్‌తో సరిహద్దులను పంచుకునే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ప్రయాణాలు మానుకోవాలని తమ పౌరులకు సూచించింది. ఈ అడ్వైజరీపై భారత్ ఘాటుగా స్పందించింది.

వెళ్లొద్దట

భారత్‌లోని గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రయాణాలు మానుకోవాలని కెనడా తన అడ్వైజరీలో పేర్కొంది. ల్యాండ్‌మైన్‌ల ఉనికి, అనూహ్య భద్రతా పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ప్రయాణాలు నివారించాలని సూచించింది. తీవ్రవాద దాడుల ముప్పు కారణంగా భారత్‌లో పర్యటించే కెనడా పౌరులు అధిక స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు సెప్టెంబరు 27న కెనడా ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ట్రావెల్ అడ్వైజరీని పోస్ట్ చేసింది.

అనూహ్య భద్రతా పరిస్థితులు, మందుపాతరల కారణంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పాక్ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాంతాలకు అన్ని ప్రయాణాలను నివారించండి. భారత్ అంతటా తీవ్రవాద దాడుల ముప్పు ఎక్కువగా ఉంది. కనుక అక్కడ పర్యటించే కెనడా పౌరులు అధిక స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, తీవ్రవాదం, తిరుగుబాటు ముప్పు కారణంగా అత్యవసరమైతే తప్ప అసోం, మణిపుర్‌లకు వెళ్లొద్దు.                                                                      - కెనడా అడ్వైజరీ

భారత్ కౌంటర్

కెనడా ట్రావెల్ అడ్వైజరీ, ఖలీస్థాన్‌పై కెనడా రెఫరెండం నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కౌంటర్ ఇచ్చారు.

మిత్రదేశమైన కెనడాలో ఖలీస్థాన్‌పై రిఫరెండం నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో జరిగిన హింస గురించి మీకు తెలుసు. తాజాగా కెనడా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీని కూడా భారత్ తప్పుపడుతోంది. ఈ విషయంపై భారత్.. కెనడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది.                                                     -     అరిందమ్ బాగ్చీ, విదేశాంగ ప్రతినిధి

అయితే గతవారం భారత్ జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీకి కౌంటర్‌గా కెనడా ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కెనడాలోని భారతీయులు, భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అక్కడ భారత వ్యతిరేక చర్యలు, నేరాలు పెరిగాయని కేంద్రం ఇటీవల అడ్వైజరీ జారీ చేసింది.

Also Read: Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?

Also Read: R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్‌ వెంకటరమణి

Published at: 29 Sep 2022 01:20 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.