ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. ఆరోగ్యం సీరియస్‌గా ఉన్నట్లు రిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే లాలూ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు వైద్యులు.


మరో కేసులో శిక్ష


దాణా కుంభకోణం కేసులో బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఈరోజు శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈ నెల 15నే లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం.


ఆసుపత్రికి తరలింపు


అనంతరం ఆయన్ను బిర్సా ముండా సెంట్రల్​ జైలుకు తరలించారు అధికారులు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​(RIMS)కు తీసుకెళ్లారు.


దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది. ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులు కాగా 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపింది రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.


దాణా కుంభకోణానికి సంబంధించిన గత నాలుగు కేసుల్లో లాలూకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఈ కేసులు అన్నింటిలోనూ లాలూకు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


బిహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో రూ.950 కోట్ల దాణా కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో 1996లో ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ 53 కేసులు నమోదు చేసింది.







Also Read: UP Election: యూపీలో నో బాహుబలి, ఓన్లీ బజరంగ్‌బలి: అమిత్ షా


Also Read: UP Election 2022: 'ఆఫ్ట్రాల్ కాదు సర్- 'సైకిల్'ను అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే'