సింగరేణిలో రాఫెల్ స్కాం కంటే పెద్ద కుంభకోణం జరుగుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  సింగరేణి సంస్థ లో 51 శాతం రాష్ట్ర వాటా, 49 శాతం కేంద్రం వాటా వుందని.. సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అమ్మడానికి ముందుకొస్తే.. రాష్ట్ర సర్కార్ అడ్డుకోడానికి ముందుకు రాలేదని విమర్శించారు. సింగరేణి  25 ఏళ్ళు లీజ్ ఇవ్వడానికి కేసీఆర్ తన అధికారాన్ని వినియోగించి ప్రైవేట్ పరం చేసే కుట్ర చేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఏడేళ్లుగా ఐఏఎస్ శ్రీధర్ సింగరేణి ఛైర్మెన్, సీఎండీ గా కొనసాగుతున్నారని ఆయన ఆధ్వర్యంలోనే వల కోట్ల రూపాయల అవినీతికి జరుగుతుందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, ఐఏఎస్ శ్రీధర్ కలసి అక్రమాలకు పాల్పడుతున్నారని..ఎంతో మంది ఐఏఎస్ లున్నా నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్‌ను కొనసాగించడాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  శ్రీధర్ పై ఎన్నో ఆరోపణలు వచ్చిన కేసీఆర్ తొలగించలేదు..కోల్ ఇండియా కూడా వద్దని చెప్పిన కేసీఆర్ వినలేదన్నారు రేవంత్ రెడ్డి. 


సింగరేణిలో రూ. 50వేల కోట్ల స్కాం ! 


ఒరిస్సా లోని నైని కోల్ మైన్ 25 ఏళ్లు ప్రైవేట్ సంస్థకు లీజ్ ఇచ్చారని .. దీని ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చుని.. కోల్ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరి వ్యక్తులకు లబ్ది చేకూరే పని చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టెండర్ ఎవరికీ రాకుండా చేసే కుట్ర చేశారన్నారు. రాఫెల్ కుంభకోణం కంటే ఇది పెద్దదని.. రాఫెల్ రూ. 35 వేల కోట్ల స్కాం అయితే .. ఇది రూ. 50 వేల కోట్ల కుంభకోణమని రేవంత్ విమర్శించారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి దీనిపై కేంద్రానికి ప్రధానికి, హోమ్ , విజిలెన్స్ , కోల్ మినిస్టర్, కోల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేశామన్నారు. 


సింగరేణి బొగ్గును అదానీ పరం చేసే కుట్ర ! 


ఇంత పెద్ద టెండర్ ని ఎవరికీ దక్కకుండా  టేలర్ మేడ్ కండిషన్ పై ముగ్గురి టెండర్లు వేసేలా చేశారన ిఆరోపించారు. కేంద్ర మైనింగ్ మినిస్టర్ ప్రహ్లద్ జోషి కూడా ఏమి చేయలేమని..పీఎంవో కార్యాలయం చూస్తుందని చెప్పారని..సెంట్రల్ విజిలెన్సు కమిషన్ కు రిఫర్ చేయండి అన్నా.. ప్రహల్లాద్ చేతులెత్తేశారని రేవంత్ ఆరోపించారు. టెండర్ బాక్స్ ఓపెన్ చేస్తే.. ఇద్దరి ముగ్గురికే లాభం చేకూరుతుందన్నారు.  ఐఏఎస్ అధికారి శ్రీధర్ కు ఫోన్ చేసి తప్పు చేస్తున్నావ్ అని చెప్పినా.. ఆయన నిస్సహాయకత వ్యక్తం చేశారని విమర్శించారు.  ఆదానికి టెండర్ దక్కితే.. ఆయన ఎవరికైనా ఆర్ధిక పెట్టుబడి దారికి అవకాశం కల్పించవచ్చు..  అదానీ మోడీ మనిషి ఐతే.. ప్రతిమ శ్రీనివాస్ కేసీఆర్ బినామీ రూపంలో నైని సంస్థల్లోకి ఎంట్రీ కాబోతున్నారని రేవంత్ జోస్యం చెప్పారు. 


సింగరేణి సీఎండీపై ఎందుకు విచారణ జరిపించరు ? 


సౌర విద్యుత్ కొనాలని మోడీ అంటుండు అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు నైని కోల్ మైన్ ఎట్లా ఆదానికి కట్టబెడుతున్నావని రేవంత్ ప్రశ్నించారు. మొత్తం భూగర్భ గనులను కేసీఆర్ కుటుంబం దోచుకునే పని చేస్తుందని ఆరోపించారు.  మోడీ, అమిత్ షా ఎందుకు కేసీఆర్ అవినీతిపై విచారణకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్ లో డిజిపి పై చర్య తీసుకున్న కేంద్రం.. శ్రీధర్ పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదు.. శ్రీధర్ పై తీవ్ర ఆర్ధిక ఆరోపణలు వున్నా ఎందుకు బిజెపి నాయకులు మాట్లాడ్డం లేదుని ప్రశ్నించారు.  మొన్నటి వరకు మోడీ కేసీఆర్ కలిసి దోచుకుంటే.. ఇవ్వాలా విడిపోయి దోచుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. పారదర్శకంగా టెండర్లు పిలవడానికి కేంద్రం ముందుకొస్తుందా లేదా అని నిలదీశారు. 


బీజేపీ మిత్రపక్షాలను కేసీఆర్ ఎందుకు కలవరు ? 


సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ .. బిజెపి ని ఎదురు లేని శక్తిగా మారడానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలను కలుస్తున్నారు కేసీఆరని రేవంత్ విశఅలేషించారు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై, ఇరిగేషన్ ప్రాజెక్టుల పై  మాట్లాడుకున్నాం అని శరద్ పవర్, సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎంపీ సుప్రియ సూలే.. ట్వీట్ చేశారని.. కానీ కేసీఆర్ అండ్ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. వేరే రకంగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.  ఇప్పటి వరకు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. కేసీఆర్.. జగన్, కేజ్రీవాల్, ఇతర నేతలను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. 


జగ్గారెడ్డి, వీహెచ్‌కు అండగా ఉంటాం !


పార్టీలోని అంతర్గత సమస్యలపై రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. జగ్గారెడ్డి, వీహెచ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం విషయంలో వారికి అండగా ఉంటామన్నారు. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తమ పార్టీలోని వివాదం కుటుంబసభ్యుల మధ్య పంచాయతీ లాంటిదని సమసిపోతుందన్నారు. గతంలో వారిపై సోషల్ మడియా పోస్టులు పెట్టిన వారు కౌశిక్ రెడ్డి అనుచరులని తేలిందన్నారు.