Pawan Kalyan Letter to PM Modi: ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాశారు. దీనిపై సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని తన 5 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. 'వైసీపీ పాలనలో భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్లు దుర్వినియోగం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తైతే 86,984 మందికే ఇళ్లు ఇచ్చారు. వీటన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.' అని లేఖలో కోరారు.


లేఖలో ముఖ్యాంశాలు



  • పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోంది. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయి. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోంది.

  • రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'పేదలందరికీ ఇళ్లు' పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21.87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారు. 

  • మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజాధనం భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. 

  • వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది. పీఎంఏవై (అర్బన్, రూరల్), జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు. 

  • పేదలందరికీ ఇళ్లు పథకం నిర్వహణ ప్రక్రియలో వైసీపీ ప్రభుత్వం తేదీల వారీగా ఇలా చేసింది. మే 29, 2021 – 30 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు అందిస్తామన్నారు. జూన్ 10, 2021 – 30.76 లక్షల ఇళ్ల స్థలాలను అందించేందుకు 68,381 ఎకరాల భూమిని సేకరించారు.  నీతి ఆయోగ్ కు ఇచ్చిన సమాచారం ప్రకారం 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

  • మార్చి 17, 2022 – 30.76 లక్షల ఇళ్ల స్థలాలు. దీని కోసం 71,811 ఎకరాల భూమి సేకరణ. మార్కెట్ విలువ ప్రకారం రూ.25 వేల కోట్లతో సేకరించారు. మే 29, 2022 – 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ అని, నవంబరు 9, 2022 – 30.20 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటించారు. 

  • డిసెంబరు 30, 2022న – 21.26 లక్షల లబ్ధిదారుల కోసం చేస్తామన్న ఖర్చు రూ. 53,296 కోట్లు. ఇళ్ల స్థలాల పట్టాలు మొత్తం 30.76 లక్షలు. దీని కోసం పెట్టిన మొత్తం ఖర్చు రూ.75,670.05 కోట్లు. 

  • ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 12, 2023న 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశం అంటూ ఇచ్చిన పత్రికా ప్రకటనలో దీని కోసం రూ.56,102 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది. మొదట చెప్పిన లెక్కకు దీనికి చాలా వ్యత్యాసం ఉంది.

  • మొదట్లో కేవలం భూ సేకరణ కోసం రూ.35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉంది. రాష్ట్ర బడ్జెట్ లో రూ.23,106.85 కోట్ల మేర కేటాయించి, వ్యయం చేసింది మాత్రం కేవలం రూ.11,358.87 కోట్లు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై (అర్బన్) పథకం ద్వారా రాష్ట్రానికి విడుదల చేసింది రూ.14,366.08 కోట్లు. 

  • మొత్తం పథకంలోని అన్ని విషయాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సీబీఐతో పాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉంది. అని పవన్ కల్యాణ్ మోదీకి లేఖలో వివరించారు.


Also Read: టీడీపీ జనసేన కలయికతో జగన్ మైండ్‌ బ్లాంక్‌ అయింది- సైకిల్ ఎక్కుతున్నట్టు నిర్మాత నట్టి కుమార్ ప్రకటన