"మా" ఎన్నికలు ఎంత ఉత్కంఠగా జరిగాయో.. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు అంతే టెన్,న్‌గా మారుతున్నాయి. ఫలితాలు వచ్చిన రోజే  "మా"కు నాగబాబు రాజీనామా చేయగా తర్వాతి రోజు ప్రకాష్ రాజ్, శివాజీ రాజా కూడా గుడ్ బై చెప్పారు. అయితే వీరి రాజీనామాలను ఆమోదించబోమని కొత్త అధ్యక్షుడు విష్ణు అంటున్నారు. కానీ ఇండస్ట్రీ రాజకీయాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.


"మా"లో రాజీనామాల పర్వం ! 


ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ  "మా"కుటుంబమే అని అందరూ చెబుతున్నారు. కానీ వివాదాస్పద ప్రకటనలు మాత్రం చేస్తూనే ఉన్నారు. తాజాగా మంచు విష్ణు, మోహన్ బాబు ప్రెస్‌మీట్ పెట్టి నేరుగా చిరంజీవిపైనే విమర్శలు గుప్పించారు. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు .. చిరంజీవి ప్రస్తావన తీసుకువచ్చారు.  "మా" అధ్యక్షుడి పదవి ఏకగ్రీవం అవడానికి తనను పోటీ నుంచి వైదొలగాలని సూచించారని ప్రకటించారు. తాను బయటకు చెప్పదల్చుకోలేదని.. కానీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెబుతున్నాన్నారు. ఇది టాలీవుడ్‌లో మరింత సెగ రాజేసే అవకాశం కనిపిస్తోంది.




Also Read : 'నన్ను ఎలెక్షన్స్ నుంచి సైడైపోమని చెప్పిందే చిరంజీవి అంకుల్..' మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..
ఎన్నికల గ్యాప్ మరింత పెరిగేలా ప్రకటనలు !


టాలీవుడ్‌ పరిశ్రమ చాలా చిన్నది. ఇప్పుడు జరిగిన అసోసియేషన్ ఓటర్లు కూడా ఎనిమిది వందల మంది లేరు. వీరిలో స్టార్లు.. గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఫేడవుట్ అయిపోయిన నటులే ఇందులో ఎక్కువ మంది ఉన్నారు.  వీరిలో కొంత మంది సభ్యులుగా ఉన్నా లేకపోయినా ఒకటే. కానీ యాక్టివ్‌గా ఉన్న సభ్యుల మధ్య ఇప్పుడు చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. మంచు విష్ణునే.. రామ్‌చరణ్ తనకు ఓటేయలేదని.. ప్రకాష్ రాజ్‌కే ఓటేశారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల మరింత దూరం పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. దీంతో ముందు ముందు పరిస్థితి మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.


Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?


"మా"లో జరగాల్సిన విభజన జరిగిపోయిందా ?


 "మా"కు ప్రస్తుతం ముగ్గురు రాజీనామాలు  చేశారు. ప్రస్తుతం ఎన్నికయిన కార్యవర్గంపై కొంత మందికి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల్లో పోటీ సందర్భంగా గెలుపు కోసం ప్రచారం చేసిన అంశాలు కానీ..  ఎదుటి వారి మీద చేసిన ఆరోపణలు కానీ.. విమర్శలు కానీ .. వెంటనే మర్చిపోయేవి కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయి అంటే..అంతకంతూ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా...  గెలుపోటములు వదిలి పెట్టి కలసి పని చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఈ రాజీనామాల పరంపర ఇలా సాగితే చీలిక అనివార్యం కావొచ్చు. ఒక వేళ రాజీ పడినా .. అది బయటకే. జరగాల్సిన విభజన  "మా"లో జరిగిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి