Iran Hijab Row:


హిజాబ్‌కు వ్యతిరేకంగా..


ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. ఫలితంగా...ప్రభుత్వం ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏం చేసైనా సరే...వారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే...23 ఏళ్ల యువకుడు మోసిన్ షెకారీని ఉరి తీసింది ప్రభుత్వం. ఇరాన్ పత్రిక్ మిజాన్ ఈ విషయం వెల్లడించింది. టెహ్రాన్‌లోని ఓ రోడ్‌ని బ్లాక్ చేసి...భద్రతా బలగాలపై దాడి చేశాడని, అందుకే ఉరి తీశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటి వరకూ ఈ నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు చేసినప్పటికీ..ఇలా ఉరి తీయలేదు. అనధికారికంగా కొందరిని కాల్చి చంపారు. కానీ...ప్రభుత్వమే అధికారికంగా ఇలా "ఉరి తీయడం" ఆందోళనకారుల్లో భయాన్ని పెంచుతోంది. "ఎలాంటి అల్లర్లు సృష్టించకండి" అని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఇప్పుడీ ఉరితో ఆ హెచ్చరికల తీవ్రతను పెంచినట్టైంది. ప్రభుత్వ హెచ్చరికల్ని కాదని రోడ్లపై ఇలా నిరసనలు చేపడితే...ఇలాంటి శిక్షే పడుతుందని తేల్చి చెప్పింది. ఈ యువకుడు సైనికుడిని చంపినట్టు ఆధారాలున్నాయని, అందుకే ఉరి తీశామని స్పష్టంగా చెబుతోంది. 


మహిళలపై కాల్పులు..
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలపై ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుపుతున్నాయి. ముఖం, ఛాతి, జననాంగాలను లక్ష్యంగా చేసుకుని ఫైరింగ్ చేస్తున్నట్టు వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కొంత మంది మెడికోలను స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేయగా...ఈ సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. గాయ పడిన మహిళలకు రహస్యంగా వైద్యం చేస్తున్న కొందరు నర్స్‌లు, వైద్యులు ఈ విషయం చెప్పారు. వీళ్లు మళ్లీ పోలీసుల కంటపడకుండా...అరెస్ట్ అవకుండా వైద్య సిబ్బందే రక్షిస్తున్నారు. అయితే...పురుషులనూ టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్నారని..కాకపోతే..వాళ్ల కాళ్లపై, వెనక భాగంలో ఫైరింగ్ చేస్తున్నారని తెలిపారు. కానీ...మహిళలపై మాత్రం ఇలా పాశవికంగా జననాంగాలపై కాల్పులు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యులు. దేశమంతా ఇంటర్నెట్‌ను బ్లాక్ చేసిన కారణంగా...గాయాల ఫోటోలను బయట పెట్టలేకపోయారు. అయితే..వాటిని ప్రింట్ తీసి మీడియా ప్రతినిధులకు చూపించారు. వాళ్లెంత దారుణంగా గాయపడ్డారో ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతోందని మీడియా కథనాలు చెబుతున్నాయి. మరీ దగ్గర నుంచి వారిని కాల్చారని వెల్లడించాయి. శరీరమంతాబులెట్ బాల్స్‌ చొచ్చుకుపోయినట్టు సమాచారం. 


ప్రభుత్వం ఏం చేస్తోంది..? 


అసలు ఈ సమస్యంతా ఆ మొరాలిటీ పోలీసుల వల్లే వచ్చిందని భావించిన ప్రభుత్వం...ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రాసిక్యూటర్ జనరల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మొరాలిటీ పోలీస్ యూనిట్స్‌ అన్నింటినీ తొలగించింది. "న్యాయవ్యవస్థలో మొరాలిటీ పోలీసింగ్‌కు స్థానం లేదు. ఈ వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదు" అని అటార్నీ జనరల్ మహమ్మద్ జాఫర్ వెల్లడించారు. గతంలో ఈ మొరాలిటీ పోలీస్‌లను "గైడెన్స్ పాట్రోల్" గా పిలిచేవారు. హిజాబ్‌ సంస్కృతిని విస్తృతం చేయాలనే లక్ష్యంతో...ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2006లో ఇరాన్ అధ్యక్షుడిగా మహమౌద్ అహ్మదినెజాద్ ఉన్న సమయంలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పాట్రోలింగ్ కొనసాగుతోంది. 


Also Read: Himachal CM Race: హిమాచల్ సీఎం రేసులో ప్రతిభా సింగ్ ఔట్? ఆమెను పట్టించుకోని అధిష్ఠానం!