Zomato Fined:


జొమాటోకి షాక్..


ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకి (Zomato Fined) రూ.లక్ష జరిమానా విధించింది కన్‌జ్యూమర్ ఫోరమ్. జొమాటోతో పాటు మెక్‌డొనాల్డ్‌కి (McDonald's) కూడా ఫైన్‌ వేసింది. జోధ్‌పుర్‌లోని జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఈ నిర్ణయం తీసుకుంది. వెజిటేరియన్‌ ఫుడ్‌ ఆర్డర్ చేస్తే...వెజ్‌కి బదులుగా నాన్‌ వెజ్‌ పంపినందుకు ఈ ఫైన్‌ విధించినట్టు వెల్లడించింది. Consumer Protection Act, 2019ని ఉల్లంఘించినందుకు ఈ ఆదేశాలిచ్చింది. దీంతో పాటు లీగల్‌ యాక్షన్ తీసుకున్నందుకు ఆ ఖర్చులనూ వసూలు చేసింది. రూ.5 వేల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుని జొమాటో సవాల్ చేసింది. తమ కంపెనీకి మెరిట్ రికార్డ్ ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి అప్పీల్ చేసుకుంటున్నట్టు వెల్లడించింది. వెజ్‌కి బదులుగా నాన్‌ వెజ్‌ డెలివరీ చేశారన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని వాదిస్తోంది. అయితే...జొమాటో టర్మ్స్ అండ్ సర్వీస్‌లో (Zomato Terms of Service)లో ఓ కీలక విషయాన్ని ప్రస్తావిస్తోంది. జొమాటో అనేది కేవలం ఫుడ్‌ని అందిస్తుందని, అందులో ఏముంది అనేది కేవలం రెస్టారెంట్‌ పార్ట్‌నర్‌ పరిధిలో ఉండే విషయమాని వివరిస్తోంది. అంటే...అలాంటి తప్పులతో జొమాటోకి సంబంధం లేదని, రెస్టారెంట్‌లు చేసిన తప్పులకు తమ కంపెనీకి మచ్చ తీసుకురావద్దని చెబుతోంది. దీనిపై పూర్తిగా రెస్టారెంట్‌దే బాధ్యత అని తేల్చి చెప్పింది. పోరాడి మరీ తమ నిజాయితీని నిరూపించుకుంటామని అంటోంది. యూపీలోని లఖ్‌నవూలోనే ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చిల్లీ పనీర్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా చిల్లీ చికెన్‌ డెలివరీ చేశారు. దీనిపై కస్టమర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఇద్దరి పైనా కన్‌జ్యూమర్ ఫోరమ్ జరిమానా విధించింది. 


ఆ సిటీల్లో సర్వీస్‌లు బంద్..


ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. 225 చిన్న పట్టణాలు/ నగరాల్లో సేవలు నిలిపేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (డిసెంబర్‌ త్రైమాసికం) కంపెనీ నష్టాలు భారీగా పెరిగాయి. ఆ త్రైమాసికంలో, ఆహార పంపిణీ వ్యాపారంలో రూ. 346.6 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2021లోని ఇదే కాలంలో సంస్థ నష్టం కేవలం రూ. 67 కోట్లుగా ఉంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ వ్యాపారంలో వేగం తగ్గడం, కంపెనీ ప్రకటనలు & ఇతర వ్యయాలు పెరగడం, బ్లింకిట్‌ నుంచి పెరిగిన నష్టాలు కలగలిసి మొత్తం నష్టాలను భారీగా పెంచాయి. కార్యకలాపాల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ. 1,112 కోట్ల నుంచి రూ. 1,948 కోట్లకు పెరిగినా.. మొత్తం వ్యయాలు కూడా రూ. 1,642 కోట్ల నుంచి రూ. 2,485 కోట్లకు పెరగడం వల్ల భారీ నష్టాలు తప్పలేదు.ఫుడ్‌ డెలివెరీ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలకు వ్యాపారం తగ్గిందని జొమాటో సీఎఫ్‌వో అక్షత్‌ గోయల్‌ తెలిపారు. గతేడాది అక్టోబర్‌ తర్వాతి (దీపావళి తర్వాత) నుంచి వేగం మందగించిందని వివరించారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, ముఖ్యంగా, టాప్‌-8 నగరాల్లో బిజినెస్‌ చాలా ఎక్కువగా తగ్గిందని వెల్లడించారు. 


Also Read: క్వాల్‌కమ్‌లో మరోసారి లేఆఫ్‌లు, ఉద్యోగులకు ఇంకెన్నాళ్లో ఈ టెన్షన్‌