• రాష్ట్రంలో పెట్రోలుపై మేం పన్ను పెంచలేదు.. కాబట్టి తగ్గించం. పెంచింది లేదు కాబట్టి తగ్గించబోమన్న తెలంగాణ సీఎం కేసీఆర్- ఇదో రాజకీయం..

  • కేంద్ర ప్రభుత్వం పెంచింది... ముందున్న ప్రభుత్వం చెడ్డది.. రోడ్లు వేయడం కోసం సెస్సు వేస్తున్నాం.. ఏపీ ముఖ్యమంత్రి పేరుతో భారీ ప్రకటన - కొన్ని నిజాలను దాచేసిన ఇంకో రాజకీయం..

  • ప్రజలకు దీపావళి కానుక - పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గింపు- ఇది మహా మహా రాజకీయం..


ఇక్కడ ప్రభుత్వాలు.. పాలనలు అంటూ ఏం లేవు రాజకీయాలే.. ఓట్ల బేరాలే.. చమురు ధరలను ఆకాశానికి, ఇంకా కుదిరితే అంత కంటే ఎక్కువకు తీసుకెళ్లి.. జనాలకు చుక్కలు చూపించిన కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఓ నీటి చుక్కను రాల్చినట్లు.. కొంత తగ్గించి.. ఇక దీపావళి పండుగ చేసుకోమంది. సరే మంచికో.. చెడుకో.. ఆ కాస్తయినా తగ్గింది.. అదే భాగ్యమని జనాలు సరిపెట్టుకోగా.. కేంద్రం తగ్గించిన దానికి మరికొన్ని రాష్ట్రాలు మరికాస్త తగ్గించి.. ఉపశమనం కల్పించాయి. అయితే.. కేంద్రం కాస్త తగ్గించి దీపావళి పండుగ చేసుకోమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పండుగ అయిపోయాక పెట్రోలు బాంబులు పేల్చుతున్నారు.. సీఎంలు.


అందుకు పత్రికా ప్రకటనా..!!
కేంద్రం పెట్రో రేట్లు కొంత తగ్గించగానే బీజేపీ ఆట మొదలెట్టింది. కేంద్రం నిర్ణయం వచ్చిన తర్వాత.. మొత్తం 22 రాష్ట్రాలు తమ వ్యాట్‌‌ను తగ్గించాయి. ఇందులో మెజార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాలు, లేక వాళ్ల  మద్దతు ఉన్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా పెట్రోలు రేట్‌ తగ్గించాలని బీజేపీ ధర్నాలు చేయడం మొదలు పెట్టింది. దీనిపై ఆయా రాష్ట్రాలు వివిధ రూపాల్లో స్పందించాయి. ఏడో తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఓ ఫుల్ పేజీ భారీ పత్రికా ప్రకటన ఇచ్చింది. దానర్థం ఏంటంటే.. మేం పెట్రోలు రేట్లు తగ్గించేది లేదు అని చెప్పడం. రేట్లు తగ్గించం అని చెప్పడం కోసం.. రూ.కోట్లు ఖర్చు పెట్టి ఇలా ప్రకటనలు ఇస్తారా..? అని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. వాళ్ల విమర్శలను పక్కన పెడితే.. అసలు ఆ ప్రకటనలో ఏముందని చూస్తే.. కేంద్రమే పెట్రోలు రేట్ల పేరుతో దోచుకుంటోందని.. ఏపీ ప్రభుత్వం.. కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. 


కేంద్రం రాష్ట్రాల నుంచి 3 లక్షల 30 వేల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేస్తూ రాష్ట్రాలకు మాత్రం వివిధ రూపాల్లో కోతలు పెట్టి.. రూ.19 వేల కోట్లు మాత్రమే అని చెప్పింది. అంటే కేవలం 5.8 శాతం. నేరుగా వసూలు చేస్తే.. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని.. అడ్దదారుల్లో బాదుడు మొదలు పెట్టింది. అందుకే రాష్ట్రాలకు డబ్బు రావడం లేదని కేంద్రం బండారం బహిరంగంగా ఏపీ ప్రభుత్వం పత్రికా ప్రకటనలో చెప్పింది. ఈ విషయం మామూలుగా కొద్ది మందికి తెలుసు.. కానీ బహిరంగంగా కేంద్రం దోచుకుంటుందని చెప్పడమే.. ఈ ప్రకటన ఉద్దేశం. ధర్నాలతో తమను చిరాకు పెడుతున్న బీజేపీకి రిటార్ట్ ఇవ్వడం అన్నమాట ఇది. సరే తప్పంతా.. కేంద్రానిదే.. బాగా గుంజేస్తోంది.. వాళ్లే.. మేం.. జస్ట్ శాంపిల్ అని చెప్పుకోవడం అది బాగానే ఉంది. అయితే, ఆ ప్రకటనలో ఇంకో మతలబు కూడా ఉంది. 


2015 నుంచి రాష్ట్రంలో పెట్రో టాక్సులు ఎంత అనేది మొదలు పెట్టారు. అంతకు ముందు టాక్సులు లేవా అన్న విషయం చెప్పరు. ఈ ప్రభుత్వానికి అంతకు ముందు ప్రభుత్వంలో ఏముందీ అని చెప్పడమే క్రేటీరియా. 2015 కు ముందు పెట్రోలుపై 31 శాతం , డీజీల్‌పై 22.5 శాతం వ్యాట్‌ ఉండేది. ఆ తర్వాత 2015-18 సెప్టెంబరు వరకూ.. రూ.4 అదనపు పన్నును టీడీపీ వేసింది. అని ప్రకటన ద్వారా చెప్పదలిచారు. సెప్టెంబర్‌ 2020 నుంచి మళ్లీ పాత పద్దతిలో రూ.4 అదనపు టాక్స్, రూ.1 రోడ్డు సెస్సు వేశామన్నారు. మరి మధ్యలో రెండేళ్లు ఏమయ్యాయి. ఆ విషయాన్ని ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా దాచేసింది. ఇది అసలైన రాజకీయం. అప్పటి టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో పెట్రో ధరలు అధికంగా ఉన్నాయని తాము పెంచిన రూ.4 నుంచి రూ.2 తగ్గించారు. అఫ్‌కోర్స్ ఇది కూడా అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా తీసుకున్న నిర్ణయం. కారణం ఏదైనా కావచ్చు కానీ.. వినియోగదారులకు కాస్త ఊరట దక్కింది. అయితే వైసీపీ ప్రభుత్వం కరోనా కారణంగా రాబడి తగ్గిందని.. అందువల్ల అదనపు వ్యాట్‌ మళ్లీ విధిస్తున్నామని చెప్పింది. అంత వరకూ అర్థం చేసుకోవచ్చు. 


మళ్లీ రోడ్డు సెస్ కూడా..
కానీ దానికి రోడ్డు సెస్సు పేరిట మరో రూ.1, దానిపైన వ్యాట్ కూడా పెరిగింది. మొత్తం మీద ఒక్క ఏడాదిలోనే ఏపీలో పెట్రోలుపై ఏడున్నర రూపాయలు, డీజిల్‌పై ఐదున్నర రూపాయలు పెరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది అక్షరాల నిజం కూడా. దేశంలోనే అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఉంది ఏపీలో. ఇప్పటికీ ఈ విషయంలో ఏపీనే టాప్. అన్నింటికంటే.. జనాలను ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే.. రోడ్డు సెస్సు పేరుతో రూపాయి తీసుకోవడం. ఆంధ్రప్రదేశ్‌కు పెట్రోలియం ప్రోడక్ట్స్ ద్వారా ప్రతి ఏటా రూ.11 వేల కోట్లు పన్నుల రూపంలో వస్తోంది. ఇందులో రోడ్డు సెస్సు పేరుతో ఉండే మొత్తమే కొన్ని వందల కోట్లు ఉంటుంది. అంటే రెండేళ్ల నుంచి రోడ్డు సెస్సు పేరుతో వందల కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. ఏపీ రోడ్లు గురించి.. తెలిసిన వారికి ఎవరికైనా ఇది బాధ కలిగించేదే.. 


రోడ్లపై పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?
ఆర్ అండ్ బీ లెక్కల ప్రకారమే.. ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లపై ఖర్చు చేసింది.. కేవలం రూ.40 కోట్లు. ఇప్పుడు రూ.2,200 కోట్లతో రోడ్లు బాగు చేస్తామంటున్నారు. ఎప్పటికవుతాయో తెలీదు. కేంద్రం ఏం చేస్తే ఏంటి.. అడిగిన వారందరికీ వరాలు ఇస్తున్న జగనన్న పెట్రో రేట్లు తగ్గించాడా..? లేదు.. కేంద్రం తగ్గించింది.. మనకు కూడా తగ్గుతాయిలే అని ఎదురు చూసిన సగటు పెట్రో వినియోగదారుడికి అదే నిరాశ ఎదురయింది. పైగా పే..ద్ద ప్రకటన ఇచ్చి తగ్గించబోం అని చెప్పేశారు. తలచుకుంటే అవ్వదా.. అవుతుంది. కానీ.. జనాలకు కేంద్రం పేరు చెప్పి.. అప్పటి టీడీపీ పేరు చెప్పి బురిడీ కొట్టించారు -అదే రాజకీయం.


తెలంగాణలో ఇదీ పరిస్థితి
ఇక కేసీఆర్.. ఆయన ప్రెస్‌మీట్ అంటేనే మహా రంజుగా ఉంటుంది. హుజూరాబాద్ ఓటమి తర్వాత బయటకొచ్చిన కేసీఆర్.. ఏదో గట్టిగానే మాట్లాడతారు అనుకుంటే పెట్రో బాంబ్‌ పేల్చారు. అంటే ఆయన పెంచారని కాదు. కచ్చితంగా తగ్గుతుంది.. అనుకున్న జనాలకు.. తగ్గించబోం అంటే.. పెంచడంతోనే సమానం కదా.. మేం పెంచలేదు కాబట్టి బరాబర్ తగ్గించేది లేదు.. అని చెప్పేశారు. కానీ 2015లో పెట్రోలు, డీజిల్‌పై ఈయన ప్రభుత్వమే వ్యాట్ పెంచింది.. ఆ విషయం  కేసీఆర్ చెప్పలేదు. సరే చాలా కాలం అయిందిగా అని అనుకోవచ్చు. కానీ, దేశంలో చాలా రాష్ట్రాల కన్నా తెలంగాణలో  పన్ను ఎక్కువగా ఉంది. కానీ, ఈయన కూడా బీజేపీ మీదకు తోసేసి వదిలేశారు.


అసలు దోపిడీ చేసింది కేంద్రమే..!
ఇక అసలు సిసలు దోపిడీ కేంద్రం. రూ.10 తగ్గించా పండుగ చేసుకో అని చెబుతున్న ఈ ప్రభుత్వం పెట్రోలు రేటును ఏకంగా 80-90 శాతానికి పెంచిన విషయం జనాలకు తెలీనట్లు మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు చెబుతున్నట్లు.. ఇది నాలుగు రాష్ట్రాల ఎన్నికల ముందు వేసిన స్టంట్‌ అని తెలిసిపోతోంది. పండుగ మిఠాయి పొట్లం అని చెబుతున్నా.. ఆ గిఫ్టుకు చుట్టిన రాపర్.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే అని అర్థమవుతోంది. అవన్నీ మామూలు రాజకీయాలు అయితే.. ఇది మహా మాహా రాజకీయం అన్నమాట. పైగా తమకు పోటీగా ఉన్న రాష్ట్రాలను ఇరికించడం ఇందులో ఒక వ్యూహం.


అన్ని పార్టీలు.. ఈ రాజకీయ క్రీడలను బాగానే ఆడుతున్నాయి. కానీ ఈ ఆటలో పావులుగా ఉంది ఎవరో తెలుసా? కామన్ మ్యాన్.. అవును మనమే.. వాళ్లది తప్పు.. అంటే.. వీళ్లది తప్పు.. అని.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణల హడావుడీలో చివరికి మన జేబులే గుల్ల అవుతున్నాయి. డీజిల్ రూ.68కే ఇవ్వొచ్చు అని కేసీఆర్ అంటున్నారు. ఇవ్వకుండా ఆపుతోంది ఎవరు..? పేరు ఏదైనా అన్నీ ప్రభుత్వాలేగా? అంతిమంగా నష్టపోతోంది ఎవరు..? ప్రజలే..! 


జీఎస్టీలో చేర్చేందుకు వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు
కేంద్రం తమ పన్నుల వాటా ఇవ్వడం లేదంటున్న రాష్ట్రాలు కూడా పెట్రోలును వస్తు వసేవల పన్ను పరిధిలో చేర్చడానికి వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే.. వీళ్లకి ఇది ప్రధాన ఆదాయ వనరు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. విపరీతంగా పన్నులు పెంచేసి సామాన్యుడు ఇక పెట్రోలు, డీజిల్ వాడటానికి కూడా భయపడేలా చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు.. కాస్త తగ్గించి సంబరపడమంటున్నాయి. ఇందులో కేంద్రం, రాష్ట్రాలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయి. ఏడేళ్లలో 80 శాతం పెరిగాయి.. ఇంధన రేట్లు. మరి, ఆ మేరకు జనాల ఆదాయాలు పెరిగాయా.. మరి అంత పెంచితే.. ఎలా బతుకుతారు? అన్న ఆలోచన ఉందా..? లేదు. కానీ తమ రాజకీయాల కోసం మాత్రం ఆటలాడుకుంటాయి.


పెట్రోలు బంకుకు వెళితే.. అక్కడ మీటరులో రీడింగ్‌ ఎలా పెరుగుతుందో.. దానిని చూసి సామాన్యుడి పల్స్ రేటు కూడా అంతే పెరుగుతోంది. అసలు వారం రోజులు వచ్చే ఇంధనం మొత్తం ఇప్పుడు మూడు రోజులకు పడిపోయింది. ఆఫీసులకు వెళ్లే వాళ్లు.. రోజువారీ వ్యాపారాలు చేసుకునేవాళ్లు ఏమైపోతారు? అందరూ అడుగుతున్నారు.. యావత్ దేశం అడుగుతోంది.. ఏబీపీ దేశం అడుగుతోంది.. రాజకీయాలు పక్కన పెట్టండి.. జనాలకు మేలు చేయండి.. అని.


Also Read : కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భే్టీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?


Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్‌.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు


Also Read : ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి