Uttarkashi Tunnel Rescue Operation Updates:


తుది దశలో..


ఉత్తరాఖండ్‌ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ (Uttarkhand Tunnel Rescue) తుది దశకు చేరుకుంది. మరి కొద్ది గంటల్లోనే శిథిలాల కింద చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురానున్నారు. ఇప్పటికే సొరంగం వద్దకు ఆంబులెన్స్‌లు తరలి వచ్చాయి. ఢిల్లీ నుంచి 7గురు నిపుణులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ రెస్క్యూ ఆపరేషన్‌కి ఉన్న అడ్డంకులన్నింటినీ రాత్రి పూట తొలగించారు. ఫలితంగా డ్రిల్లింగ్ (Vertical Drilling) ప్రక్రియ వేగంగా పూర్తైంది. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేస్తే కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికా నుంచి తెప్పించి Augur Machineని అసెంబుల్ చేయనున్నారు. బుధవారం (నవంబర్ 22) సాయంత్రం 6 గంటల తరవాత ఉన్నట్టుండి రెస్క్యూ ఆపరేషన్‌కి సవాళ్లు ఎదురయ్యాయి. స్టీల్ స్ట్రక్చర్స్ అడ్డుపడ్డాయి. వీటిని డ్రిల్లింగ్ మెషీన్‌తో కట్ చేయలేకపోయారు. ఈ పని NDRF చేపట్టింది. ఇక ఈ ఘటనా స్థలం వద్దే ఉన్న ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ (Arnold Dix)...రెస్క్యూ ఆపరేషన్‌ దాదాపు పూర్తైనట్టే అని స్పష్టం చేశారు. "సొరంగం ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం. అక్కడి శిథిలాలు తొలగిస్తే సక్సెస్ అయినట్టే" అని వివరించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. 


 






"ప్రస్తుతానికి మేం దాదాపు సొరంగం ఎంట్రెన్స్ డోర్‌ వద్దకు వచ్చేశాం. తలుపు కొడితే లోపలి వాళ్లు బయటకు వచ్చేసినట్టు...సొరంగంలో ఉన్న వాళ్లు బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశాం"


- ఆర్నాల్డ్ డిక్స్, ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్






అప్‌డేట్స్ ఇవీ..


ఉత్తరాఖండ్‌లోని చిన్యాలిసౌర్‌లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 41 బెడ్స్ సిద్ధంగా ఉంచారు. కార్మికులు బయటకు రాగానే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రిల్లింగ్ చేసిన తరవాత ఆ రంధ్రంలోకి పైప్స్‌ని అమర్చుతారు. ఒకటి లోపలికి వెళ్లిన తరవాత దానికి మరోటి జత చేర్చి వెల్డింగ్ చేస్తారు. అలా ఎస్కేప్ రూట్‌ ఏర్పాటు చేసి వాళ్లను బయటకు తీసుకువస్తారు. ఇప్పడీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే...వాళ్లు బయటకు వచ్చిన తరవాత ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. దాదాపు 12 రోజులుగా లోపల చీకట్లోనే ఉండారు. ఉన్నట్టుండి బయటకు వచ్చాక...ఉష్ణోగ్రతలు మారిపోతాయి. ఇది శరీరంపైనే కాకుండా మానసికంగానా వాళ్లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వాళ్లు బయటకు వచ్చీ రాగానే NDRFకి చెందిన సీనియర్ వైద్యుడు వాళ్లను పరీక్షిస్తారు. అయితే..లోపల నుంచి పైప్‌లోకి వచ్చి మెల్లగా అందులో పాకుకుంటూ బయటకు రావాల్సి ఉంటుంది. ఈ సమయంలోనూ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కార్మికులకు అన్ని విధాలుగా గైడ్ చేయనున్నారు. వెల్డింగ్ జాయింట్స్ ఉండడం వల్ల అవి తగిలి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.


Also Read: 'పొత్తులపై కాంగ్రెస్‌ పార్టీ ఫూల్‌ చేస్తోంది' - ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు