Muzaffarnagar Teacher:


ముజఫర్‌నగర్‌లోనే మరో ఘటన..


యూపీలో ముజఫర్‌నగర్‌లో నెల రోజుల క్రితం ఓ స్కూల్‌లో టీచర్‌ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన సంచలనమైంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. అదే ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థితో తోటి హిందూ విద్యార్థిని కొట్టించింది. దగ్గరుండి మరీ చెంపదెబ్బ కొట్టించింది. సెప్టెంబర్ 26వ తేదీన ఈ ఘటన జరిగింది. ఐదో తరగతి విద్యార్థిని టీచర్‌ కొన్ని ప్రశ్నలు వేసింది. కానీ ఆ ప్రశ్నలకు విద్యార్థి సమాధానాలు చెప్పలేదు. కోపంతో ఓ ముస్లి విద్యార్థిని పిలిచింది. సమాధానం చెప్పని ఆ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టాలని చెప్పింది. టీచర్‌ చెప్పినట్టుగా చేశాడు ఆ విద్యార్థి. అయితే...దెబ్బలు తిన్న ఆ విద్యార్థి అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడడం లేదు. అనుమానం వచ్చి తల్లిదండ్రులు ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి ప్రశ్నించగా ఈ విషయమంతా చెప్పాడు ఆ విద్యార్థి. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సెప్టెంబర్ 27న ఆ టీచర్‌పై కంప్లెయింట్ ఇచ్చారు. సెప్టెంబర్ 28న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ టీచర్‌ని అరెస్ట్ చేశారు. స్కూల్ యాజమాన్యం ఆ టీచర్‌ని విధుల్లో నుంచి తొలగించింది. 


యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో మహిళా టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సంచలనమైంది. నెల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇంకా విచారణ కొసనాగుతూనే ఉంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన మొత్తం రాష్ట్రాన్నే వణికించిందని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో యూపీ ప్రభుత్వాన్నీ మందలించింది. ఈ కేసు విచారణకు వెంటనే ఓ IPS అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆ IPS అధికారి దీనిపై నివేదిక రూపొందించి కోర్టుకి సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో బాధిత బాలుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని, మిగతా విద్యార్థులతోనూ మాట్లాడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


"ఇది చాలా తీవ్రమైన విషయం. ఓ వర్గానికి చెందిన విద్యార్థిని టార్గెట్ చేసి తోటి విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టించడం సహించరానిది. ఇదేనా చదువంటే..? ఆ బాధిత విద్యార్థి చదువు బాధ్యత అంతా ప్రభుత్వానిదే. నిజంగా ఓ వర్గానికి చెందిన విద్యార్థిని ఉద్దేశపూర్వకంగా కొట్టించారన్న ఆరోపణలు నిజమే అయితే కచ్చితంగా ఇది రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుంది"


- సుప్రీంకోర్టు 


గత నెలలో యూపీలోని ముజఫర్‌నగర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. ఓ ముస్లిం విద్యార్థిని ఓ హిందూ విద్యార్థితో కొట్టించింది మహిళా టీచర్. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖబర్‌పూర్‌ గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు.


Also Read: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు