హిందువులు మహా శివరాత్రి పండుగను ఉపవాస దీక్షలతో జరుపుకుంటారు. అయితే శివరాత్రి సందర్భంగా కన్వర్ యాత్రలో పాల్గొన్న శివ భక్తులకు ఓ వ్యక్తి బీర్లు ఆఫర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కనిపించిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ లో జరిగింది. రద్దీగా ఉండే రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న కణ్వర్ యాత్రికుల బృందానికి ఆ వ్యక్తి బీరు ఇస్తున్నాడు. కొందరు భక్తులు యాత్రలో ముందుకుసాగా, ఒకరిద్దరు భక్తులు బీర్ తీసుకుని వెళ్తున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది.


జాతీయ మీడియా ఏఎన్ఐ.. ఆ బీర్లు పంపిచిన వ్యక్తిని యోగేష్‌ అని తెలిపింది. అలీఘర్ సర్కిల్ అధికారి (CO) తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని, బైకు, 14 బీర్ క్యాన్లతో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పర్మిషన్ స్థాయిని మించి, కొన్ని నిబంధనలు ఉల్లంఘించి నడి రోడ్డుపై మద్యం విక్రయాలు చేపట్టిన ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  మహా శివరాత్రి రోజు శివ భక్తులను లక్ష్యంగా చేసుకుని కన్వర్ యాత్ర చేస్తున్న వారికి బీర్లు ఇస్తున్న వ్యక్తిపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సమాచారం. 






భిన్నంగా స్పందించిన నెటిజన్లు
ఓ వ్యక్తి భక్తులకు బీర్లు పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. కన్వర్ యాత్ర చేస్తున్న భక్తులకు బీర్లు ఇచ్చిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు. ఇందులో ఏం తప్పు ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. కాగా, ప్రార్థన చేయడానికి వెళ్లే సమయంలో ఎవరైనా ఈ పానీయాలను ఎందుకు స్వీకరిస్తారని మరికొందరు ఆశ్చర్యపోయారు.


కన్వారియాలు గతంలో తమ వద్ద ఉన్న గంజాయిని చూపించిన వీడియోలు చాలా ఉన్నాయి. అయితే వాళ్లకు బీర్లు ఇవ్వడాన్ని నిషేధించారా, వారికి మత్తు రావడానికి బీర్ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. కన్వరియాలకు బీరు అందించే వారిని మాత్రమే ఎందుకు అరెస్టు చేశారు? బీరు తీసుకునే భక్తులపై కూడా కేసులు నమోదు చేయాలి. ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు మరికొందరు నెటిజన్లు.  బీర్ అందించడం చట్ట విరుద్ధమా? బీర్లు ఇవ్వడానికి లైసెన్స్ ఉండాలని తెలిసింది. కన్వరియాలు మద్యం కావాలంటే అది ఎవరి సమస్యో అర్థం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. 


వార్షిక తీర్థయాత్రగా పేరుగాంచిన కన్వర్ యాత్రను శివ భక్తులు చేస్తారు. కన్వరియాలు అని పిలుచుకునే ఈ భక్తులు, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రిలతో పాటు బిహార్‌లోని సుల్తాంగంజ్ వంటి ప్రదేశాలకు వెళ్లి గంగా పవిత్ర జలాన్ని తీసుకెళ్లి, ఆ నీటితో దేవుడ్ని అభిషేకిస్తారు. పూజలకు ఆభక్తులు ఉపయోగిస్తారు.