Bihar Crime News: బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని జగత్‌పూర్ గ్రామంలో తాగునీటి విషయంలో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్‌ మేనళ్లులు గొడవపడ్డారు. ఇందులో ఒక మేనల్లుడు చనిపోగా మరో మేనల్లుడు గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. 


నిత్యానంద్ రాయ్‌కు ఇద్దరు మేనల్లుళ్ళు. జై జిత్ యాదవ్  విశ్వజిత్ యాదవ్. ఇద్దరి మధ్య ఏర్పడిన చిన్న విభేదాలు హింసాత్మక ఘర్షణకు దారితీశాయి. గురువారం ఉదయం జగత్‌పూర్‌లోని మంత్రి బావమరిది రఘునందన్ యాదవ్ నివాసంలో ఈ ఘటన జరిగింది. 


జై జిత్‌కు నీళ్లు అందిస్తున్న సమయంలో ఇంట్లో పని చేసే వ్యక్తి తన చేతిని నీటిలో ముంచాడని విషయంపై గొడవ మొదలైంది. ఇది ఇద్దరి సోదరుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. 
వివాదం తీవ్రమై విశ్వజిత్ ఇంట్లో నుంచి పిస్టల్ తీసుకొని జై జిత్‌పై కాల్పులు జరపాడు. దీంతో అతని మొహం భాగంలో గాయం అయింది. ఆ తర్వాత జరిగిన గొడవలో వికల్ అనే వ్యక్తి నుంచి జై జిత్ పిస్టల్ లాక్కొని తిరిగి కాల్పులు జరిపాడు. దీంతో జరపడంతో అక్కడికక్కడే విశ్వజిత్‌ మృతి చెందాడు. జై జిత్ పరిస్థితి విషమంగా ఉండటంతో భాగల్పూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.  


హై-ప్రొఫైల్ దర్యాప్తు
కేంద్ర మంత్రి బంధువుల ప్రమేయం ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నవ్‌గచ్చియా, పర్బట్టా పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులను పిలిపించి, ఆధారాలు సేకరించి, ఘటనా స్థలంలో సాక్ష్యాలు వీడియోలు తీశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 
హై ప్రొఫైల్ కేసు కావడంతో గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని రేంజ్ ఐజీ వివేక్ కుమార్ నవగచ్చియా ఎస్పీని ఆదేశించారు.


"జై జిత్‌ను మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేశారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు, నవ్‌గచ్చియా పోలీసులు ఘటన స్థలంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు" అని నవ్‌గచ్చియా ఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు.


విశ్వజీత్ భార్య ఏం చెప్పారు?
మృతుడు విశ్వజీత్ యాదవ్ భార్య మనీషా మాట్లాడుతూ, ఈ భూ వివాదం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోందని అన్నారు. ఆ కారణంగానే ఇవాళ్టి చిన్న వివాదం రక్తపాతానికకి కారణమైందన్నారు. భూ వివాదంలో రాత్రి కూడా గొడవ జరిగినట్టు మనీషా చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వాళ్ల భవిష్యత్ ఏంటని ఆమె రోధిస్తున్నారు.