US Latest News: యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్‌.ఎఫ్‌. కెనడీ హత్యకు సంబంధించిన కీలక పత్రాలను అమెరికా విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలతో విడుదలైన ఈ పత్రాల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. జాన్‌.ఎఫ్‌. కెనడీ హత్యలో సీఐఏ పాత్ర ప్రస్తావన ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 63 వేల పేజీలతో కూడిన 2,200 డాక్యుమెంట్స్‌ను యూఎస్‌ నేషనల్‌ ఆర్కీవ్స్‌ అండ్‌ రికార్డ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌లో ఉంచింది. 


దీన్ని రష్యా మద్దతు ఉన్న అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్‌వర్క్ RT  తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసి కీలకాంశాలు ప్రస్తావించింది. అలా ఉటంకించిన వాటిలో భారత్‌లోని రెండు ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, కోల్‌కతాలో సీఐఏ రహస్య స్థావరాల ఉన్నట్టు పేర్కొంది. వీటిని "బ్లాక్ సైట్స్" అని పిలిచారు. వివిధ రహస్య కార్యకలాపాల కోసం CIA వీటిని ఉపయోగించిందని తెలిపింది. 


కోల్‌కతా, ఢిల్లీ సహా, పాకిస్తాన్‌లోని రావల్పిండి, శ్రీలంకలోని కొలంబో, ఇరాన్‌లోని టెహ్రాన్, దక్షిణ కొరియాలోని సియోల్, జపాన్‌లోని టోక్యోలో కూడా  CIA స్థావరాలు ఉన్నట్టు తెలిపింది. 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన ఫైళ్లలో ఈ స్థావరాలు గుర్తించారు. 


భారతదేశానికి CIAకు చారిత్ర సంబంధాలు ఉన్నాయి. 1962లో అమెరికాకు చెందిన యూ-2 స్పై విమానాలు ఇంధనం నింపేందుకు ఒడిశాలోని చార్బాటియాను వాడుకున్నారు. ఇండియాకు చెందిన వైమానిక స్థావరాల్లో ఇది ఒకటి. 


1961లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన జాన్‌ ఎఫ్‌.కెనడీని 1963 నవంబరు 22న హత్య చేశారు. డాలస్‌లో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసులో లీ హార్వే ఓస్వాల్డ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు అప్పటి అధికారులు. ఆ కేసు విచారణ సాగుతుండగానే అతన్ని హత్య చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తు రహస్యంగానే ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ట్రంప్ సర్కారు వెలుగులోకి తెచ్చింది.