Supreme Court: " వివాహ వ్యవస్థలో ఓ మహిళ తల్లి కావడం అనేది అత్యంత సంతోషకరమైన విషయం. కానీ అత్యాచారం ద్వారా మహిళ గర్భం దాల్చడం కోలుకొలేని దెబ్బ" అని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సామూహిక అత్యాచారానికి గురైన 25 ఏళ్ల మహిళ అబార్షన్ కు అనుమతినిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించింది.


మహిళకు ఇష్టం లేకుండా బలవంతంగా గర్భం రావడం గాయం లాంటిదేనని, ఆ పరిస్థితి తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. సామూహిక అత్యాచారానికి గురై గర్భం దాల్చిన మహిళ తన 27 వారాల గర్భాన్ని చేసుకునేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ సందర్భంగా బాధిత మహిళ కేసులో గుజరాత్ హైకోర్టు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అత్యాచారానికి గురైన మహిళ గర్భస్రావం చేయించుకోవడానికి సంబంధించిన కేసు విచారణను గుజరాత్‌ హైకోర్టు వాయిదా వేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఈ కేసులో బాధిత మహిళ కు అబార్షన్ విషయంలో గుజరాత్ హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బాధిత మహిళ బాధను, మెడికల్ రిపోర్టును పరిగణంలోకి తీసుకొని ఆమె తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. రేపే ఆమె ఆసుపత్రిలో చేరాలని ఆదేశించింది. ఒకవేళ అబార్షన్ ప్రక్రియ సమయంలో పిండం సజీవంగా ఉంటే ఇంకుబేషన్లో పెట్టి సంరక్షించాలని సూచించింది. ఆ తర్వాత చట్టప్రకారం ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని వెల్లడించింది.


బాధిత మహిళ ఈ నెల 7న చేసిన వినతిపై హైకోర్టు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. సమయం మించిపోతుండడంతో పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శనివారం ప్రత్యేక విచారణను నిర్వహించింది. బాధిత మహిళ 26 వారాల గర్భం ఉన్నప్పుడు హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం 27 వారాల రెండు రోజుల గర్భం ఉందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. త్వరలోనే 28 వారాల గర్భం అవుతుందని, అది ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. గర్భస్రావం చేయవచ్చని వైద్యులు నివేదిక ఇచ్చినా, దాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రతి రోజూ విలువైనదని గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నించింది.


ఒక్క రోజు ఆలస్యమైనా దాని ప్రభావం ఉంటుందని తెలిపింది. పిటిషన్‌ను తిరస్కరించినట్టు పేర్కొన్నా.. ఆ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంపైనా స్పందించింది. దీనిపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. ఏ కారణంతో కేసు విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారని ప్రశ్నించింది. సోమవారం మొదటి కేసుకింద దీన్ని చేపట్టనున్నట్టు తెలిపింది.


" మన వివాహ వ్యవస్థలో ఓ మహిళ తల్లి కావడం అనేది ఆ దంపతులకు కాదు... వారి కుటుంబ సభ్యులకు అత్యంత సంతోషకరమైన విషయం. కానీ పెళ్లికి సంబంధం లేకుండా, మహిళకు ఇష్టం లేకుండా గర్భం దాల్చడం అనేది ఆ మహిళా జీవితానికే హానికరం. ముఖ్యంగా అత్యాచారం కారణంగా గర్భం రావడం బాధిత మహిళలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. ఇది ఆమె శరీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక మహిళ లైంగిక దాడిని ఎదుర్కోవడమే అత్యంత బాధాకరమంటే... దాని ఫలితంగా ఆమె గర్భం దాల్చడం కోలుకోలేని గాయమే అవుతుంది" అని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసను వ్యాఖ్యానించింది.