Hijab Row: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పున సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. వచ్చే వారం నుంచి హిజాబ్‌పై విచారణ చేపడతామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు.






హైకోర్టు తీర్పు


స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో అత్యవసర విచారణ కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు అనుమతించలేదు. తాజాగా వచ్చే వారం నుంచి విచారిస్తామని వెల్లడించింది.


ఇదీ వివాదం


కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ వివాదంపై రెండు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరససలు చేశారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి  రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది.


కర్ణాటక ఉడిపి జిల్లాలో ఓ ప్రభుత్వ కాలేజీలో మొదలైన ఈ వివాదం క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ అనేది ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి కాదంటూ మార్చి నెలలో తీర్పు చెప్పింది. విద్యార్థులు హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు రావడాన్ని తప్పుపట్టింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును కొట్టివేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు.


Also Read: Mumbai Landslide: విరిగిపడిన కొండచరియలు- శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయకచర్యలు


Also Read: Sri Lanka Crisis: 'మాకు ఏం సంబంధం లేదు'- ఆ వార్తలను ఖండించిన భారత్