Suicide of contractor:  కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కమిషన్లు అడగడంతో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది.   ప్రస్తుతం కర్ణాటకలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈశ్వరప్ప ఉన్నారు. మూడు రోజుల కిందట  సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్ బెళగావి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు.  ఆయన మరణానికి ముందు తన స్నేహితులకు వాట్సాప్‌ సందేశాన్ని పంపించారు, తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అందులో తెలిపారు. తాను ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం మంత్రి ఈశ్వరప్ప అని సూసైడ్ నోట్ కూడా రాశారు. ఈ ఆత్మహత్య .. సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో  బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంతోష్ పాటిల్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే పాటిల్‌ను ఇంత వరకూ పదవి నుంచి వైదొలగాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించలేదు.  అంబేద్కర్ జయంతి రోజున కర్ణాటక సీఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది.






ఆత్మహత్య చేసుకున్న  సంతోష్‌ పాటిల్‌ కొద్ది వారాల క్రితం ప్రధాని మోదీకి కూడా ఓ లేఖ రాశారు. తనకు బాకీ ఉన్న బిల్లులను ఈశ్వరప్ప చెల్లించడం లేదని, ఈశ్వరప్ప అబద్ధాలకోరని, అవినీతిపరుడని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన బిల్లులను వెంటనే చెల్లించేలా ఈశ్వరప్పను ఆదేశించాలని కోరారు. ఆ లేఖను పీఎంవో కర్ణాటక సర్కార్‌కు పంపింది. అయితే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌కు కాంట్రాక్ట్ ప‌నులు అప్ప‌గించిన‌ట్లు ప్రభుత్వ రికార్డుల్లో లేవు. అలాంట‌ప్పుడు న‌గ‌దు చెల్లింపుల స‌మ‌స్యే ఉత్ప‌న్నం కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సంతోష్ పాటిల్ మాత్రం ఎలాంటి వర్క్ ఆర్డర్లు  లేకుండానే ఈశ్వరప్ప చెప్పారని పనులు చేసినట్లుగా తెలుస్తోంది.  


సంతోష్ పాటిల్  తన ఆత్మహత్యకు మంత్రి ఈశ్వరప్పనే కారణం అని ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన రాజీనామాకు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  అస‌లు తాను కాంట్రాక్ట‌ర్ సంతోశ్‌ను ఎప్పుడూ చూడ‌లేద‌ని, ఆయ‌న‌ను ఎప్పుడు క‌లుసుకోనూ లేద‌ని ఈశ్వ‌ర‌ప్ప చెబుతున్నారు. ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదంటున్నారు.  త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై నిష్ప‌క్ష‌పాత ద‌ర్యాప్తు చేయాల‌ని సీఎం బొమ్మైని, హోంమంత్రిని విజ్ఞ‌ప్తి చేశాను అని మంత్రి ఈశ్వ‌ర‌ప్ప చెబుతున్నారు. 


 






మరో వైపు సంతోష్ పాటిల్‌ను పదవి నుంచి తప్పించి అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సీఎం ఎందుకు ఆయనపై హత్య కేసు పెట్టడం లేదని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో గవర్నర్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. బీజేపీ హైకమాండ్ ఈశ్వరప్పనురాజీనామా చేయాలని కోరబోతోందన్నప్రచారం జరుగుతోంది. కానీ తాను రాజీనామా చేసే ప్రశ్నే లేదని ఈశ్వరప్ప అంటున్నారు. ఈ వివాదం అంతకంతకూ ముదురుతోంది.