Sugar Price: రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు టమాటా, నిన్న ఉల్లి ధరలు ప్రజలను కూరలు చేసుకోనీయకుండా చేస్తే... నేడు చెక్కెర సామాన్య ప్రజల నోటిని చేదు చేస్తోంది. మరోవైపు బయ్యం, పప్పులు, ఇతర సరకుల ధరలు అమాంతం పెరుగుతుండగా.. ప్రస్తుతం పంచదార ధర కూడా విపరీతంగా పెరిగింది. ఇప్పటికే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరిందని.. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరిపడా నిల్వలు లేకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులు, చెరకు ఉత్పత్తిపై నెలకొన్న ఆందోళన, క్రష్షింగ్ సీజన్ ప్రారంభంలో నెలకొన్న ఆలస్యం ఇందుకు కారణం అని జేఎం ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది. అయితే చెరకు ఉత్పత్తిపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో పంచదార ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అంతర్జాతీయంగా కూడా చక్కెర ధరలు భారీగా పెరుగుతాయని, 12 ఏళ్ల గరిష్టానికి చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


మరోవైపు దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుందని అంతా భావిస్తున్నారు. 2023, 2024 అక్టోబర్, సెప్టెంబర్ సీజన్ లో నికర చక్కెర ఉత్పత్తి 31.7 మిలియన్ టన్నులుగా ఉంటుందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రధానంగా చెరకు ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దేశ ఉత్పత్తిలో.. మహారాష్ట్ర, కర్ణాటక నుంచే దాదాపు 45 నుంచి 50 శాతం ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు పంట మార్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 


ఈ ఫలితంగానే చక్కెర ఉత్పత్తి మరింతగా పడిపోతుందని అంతా అనుకుంటున్నారు. రాబోయే సీజన్ లో దాదాపు 30 మిలియన్ టన్నులుగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. దేశీయ వినియోగం 25 నుంచి 28.5 మిలియన్ టన్నులుగా ఉంటుంది. అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఏమీ ఉండకపోవచ్చని... కానీ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని భావిస్తే మాత్రం మే నెల తర్వాతనే ఉంటుందని నివేదిక అభిప్రాయ పడింది.


మరోవైపు విపరీతంగా పెరిగిపోయిన గోధుమల ధరలు


రష్యా నుంచి తక్కువ ధరకే గోధుమలు దిగుమతి చేసుకునే పనిలో పడింది భారత్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాలో అంతరాయం కలిగింది. ఈ దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవాలంటే డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి. అందులోనూ వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలున్నాయి. ఇలాంటప్పుడే ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది మోదీ సర్కార్. అందులో భాగంగానే రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ ట్రేడ్ ద్వారా అయినా, లేదంటే రెండు ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పందం చేసుకునైనా గోధుమలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్టు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జులై రికార్డు స్థాయి ధర పలికాయి గోధుమలు. గత 15 నెలల్లో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయి. నిజానికి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ దౌత్య చర్చలు జరపలేదు. చివరిసారిగా 2017లో ఆ అవసరం వచ్చింది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార పడుతోంది.