చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌1 విజయాల తర్వాత భారత్‌ ఇప్పుడు సముద్రపు లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను అన్వేషించనుంది. భారత్ ‘సముద్రయాన్’ అనే పేరుతో ఓ ప్రత్యేక మిషన్ చేపట్టనుంది. దీనికి సంబంధించి ట్రయల్‌ను త్వరలో ప్రారంభించబోతోంది. సముద్రం లోతుల్లో, అక్కడ ఉన్న వనరులను అన్వేషించడానికి ఈ తొలి సముద్రయాన్ మిషన్‌ను ప్రారంభించబోతోంది. ఇందుకోసం సముద్రపు లోతుల్లోకి వెళ్లడానికి ‘మత్స్య 6000’ పేరుతో ఓ జలాంతర్గామిని రూపొందించింది. దీన్ని బంగాళాఖాతంలో పరీక్షించనున్నారు. తాజాగా ఈ మత్స్య 6000 జలాంతర్గామి ఫోటోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఎక్స్‌లో షేర్ చేశారు.


జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మత్య్స సబ్‌మెరైన్ ముగ్గురు వ్యక్తులను తన సబ్‌మెర్సిబుల్ వాహనంలో 6000 మీటర్ల లోతు వరకు తీసుకువెళుతుంది. మొదటి ట్రయల్‌లో సముద్రం నుంచి 500 మీటర్ల లోతుకు ఈ జలాంతర్గామిని పంపనున్నారు. 2026 నాటికి, ఇది ముగ్గురు అక్వానాట్స్ ను సముద్రంలో 6000 మీటర్ల లోతుకు తీసుకువెళుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రెండేళ్లలో దీన్ని తయారు చేశారు. ఇది ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. గత జూన్ 2023లో టైటాన్ అనే జలాంతర్గామి అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో 5 మంది బిలియనీర్లు చనిపోయారు.


డీప్ ఓషన్ మిషన్‌లో భాగంగా సముద్రయాన్ మిషన్ నడుస్తోందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు. ‘‘మేం 2024 మొదటి త్రైమాసికంలో 500 మీటర్ల లోతులో సముద్ర ట్రయల్స్ నిర్వహిస్తాం. ఈ మత్స్య 6000 జలాంతర్గామిని నికెల్, కోబాల్ట్, మాంగనీస్, హైడ్రోథర్మల్ సల్ఫైడ్, గ్యాస్ హైడ్రేట్‌ల కోసం వెతకడమే కాకుండా, సముద్రంలో హైడ్రోథర్మల్ వెంట్స్, తక్కువ ఉష్ణోగ్రత మీథేన్ సీప్‌లలో కెమోసింథటిక్ బయోడైవర్సిటీని పరిశీలిస్తుందని ఆయన చెప్పారు.


సముద్రయాన్ మిషన్ లక్ష్యం ఏమిటి?
లోతైన సముద్ర అన్వేషణ, అరుదైన ఖనిజ వనరుల గుర్తింపు కోసం కోసం 'మత్స్య 6000' అనే వాహనంలో ముగ్గురిని 6000 మీటర్ల లోతుకు పంపడం ఈ మిషన్ లక్ష్యం. సముద్రపు లోతుల్లో లభించే లిథియం, కాపర్, నికెల్‌లను బ్యాటరీలలో ఉపయోగిస్తారు. అదే సమయంలో, ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన కోబాల్ట్, ఉక్కు పరిశ్రమకు అవసరమైన మాంగనీస్ కూడా సముద్రపు లోతులలో లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం 2030 నాటికి దాదాపు ఐదు రెట్లు ఎక్కువ లిథియం, నాలుగు రెట్లు ఎక్కువ కోబాల్ట్ అవసరమవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఇది భారతదేశానికి చాలా ముఖ్యమైన మిషన్.




మత్స్య 6000 ఫీచర్లను తెలుసుకోండి
NIOT డైరెక్టర్ GA రాందాస్ మాట్లాడుతూ.. మత్స్య 6000 కోసం 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాన్ని రూపొందించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీని లోపలి భాగంలో ముగ్గురు కూర్చునే స్థలం ఉంటుంది. అదే సమయంలో, మత్స్య 6000 బరువు 25 టన్నులు. దాని పొడవు 9 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. ఇది 80mm టైటానియం మిశ్రమంతో తయారు చేసి ఉంటుంది. ఇది సముద్ర మట్టం కంటే 600 రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదు అంటే 600 బార్ (ఒత్తిడి కొలత యూనిట్) 6000 మీటర్ల లోతులో ఉంటుంది. భారత ప్రభుత్వం 2021లో 'డీప్ ఓషన్ మిషన్'ను ఆమోదించింది. సముద్రయాన్ మిషన్ 2026 నాటికి ప్రారంభమవుతుందని అప్పుడే ప్రకటించారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే మనుషులను తీసుకెళ్లే సబ్‌మెర్సిబుల్‌లను అభివృద్ధి చేశాయి.