Mamata Benerjee: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్టు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్టు తీరు సరికాదని అన్నారు. మమతా బెనర్జీ సోమవారం మీడియా సమావేశం ఏర్పడి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు సరిగ్గా లేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో, చంద్రబాబు పాలన సమయంలో తప్పు జరిగితే మాట్లాడాలి, విచారణ జరిపించాలని వ్యాఖ్యానించారు. ప్రతీకారంతో ఎవరినీ ఏమీ చేయవద్దని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో భారీ మొత్తంలో పక్కదారి పట్టిందన్న కేసులో చంద్రబాబు నాయుడిని శనివారం రోజు తెల్లవారుజామున (సెప్టెంబర్ 9) సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా.. నంద్యాలలో బస చేసిన ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. 






పాపం బాబు అరెస్టయ్యారు: హరీశ్ రావు


తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా బాబు అరెస్టుపై స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణకు చెందిన మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. పాపం చంద్రబాబు నాయుడు అరెస్టైనట్టున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కేసీఆర్ పాలనలో వ్యత్యాసాన్ని వివరించారు.


తన నియోజకవర్గం సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు ఐటీని దేశంలో అగ్రగ్రామిగా నిలిపానని చెప్పుకునేవారు. పాపం ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు అయినట్టున్నారు. దాని గురించి మాట్లాడకూడదు అని అన్నారు. కానీ గతంలో ఆయన ఎప్పుడూ ఐటీ ఐటీ అని ప్రస్తావించేవారని హరీశ్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ లో ఐటీ రంగం మరింత అభివృద్ధి జరిగిందన్నారు. అదే సమయంలో పల్లెల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది.. దటీజ్ కేసీఆర్ రూలింగ్ అని వ్యాఖ్యానించారు.


దేశంలో బెంగళూరును ఐటీకి సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, కానీ ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం తొలి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్రంలో 3 లక్షల ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు పది లక్షల మంది ఉన్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. ఓ వైపు ఐటీ ఉత్పత్తులు, ఎగుమతులు పెరగడంతో పాటు పల్లెల్లో వ్యవసాయం బాగా జరిగి, ధాన్యాల ఉత్పత్తిలోనే దేశంలో మెరుగైన స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు.


ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్‌ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్ర బాబును కోర్టులో హాజరు పర్చినప్పుడు సీఐడీ అధికారులు కేసుకు సంబంధించిన రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది.