Rahul New House: 



త్వరలోనే షిఫ్ట్..


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ త్వరలోనే కొత్త ఇంటికి షిఫ్ట్ అవనున్నారు. ఆయనపై అనర్హతా వేటు పడిన తరవాత అధికారిక నివాసం ఖాళీ చేసి తల్లి సోనియా గాంధీ ఇంటికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కొత్త ఇంటి కోసం వెతుకుతున్నారు. ఇన్నాళ్లకు ఆయన అవసరాలకు తగ్గట్టుగా ఓ ఇల్లు దొరికినట్టు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇంట్లోనే ఆయన అద్దెకు ఉంటారని తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ షిఫ్ట్ అవనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఇన్నాళ్లూ షీలా దీక్షిత్ ఇంట్లో ఆమె కొడుకు ఉన్నారు. ఇప్పుడాయన అక్కడి నుంచి వేరే చోటకు షిఫ్ట్ అవుతున్నారు. అందుకే రాహుల్‌ ఈ ఇంటికి రానున్నారు. అంతే కాదు. రాహుల్ ఆ ఇంటిని చూసి చాలా బాగుందని చెప్పారట. వీలైనంత త్వరగా షిఫ్ట్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తరవాత తొలిసారి ఇలా అద్దె ఇంట్లో ఉండనున్నారు. అయితే..దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. సోర్సెస్ ద్వారా తెలిసిందేంటంటే...రాహుల్ వారం క్రితమే ఈ ఫ్లాట్‌ని ఫైనలైజ్ చేశారు. అంతకు ముందు తన అధికారిక నివాసాన్ని వీడే క్రమంలో రాహుల్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ ఇంటితో తనకు ఎన్నో జ్ఞాపకాలున్నాయని చెప్పారు. ఆ తరవాత తన తల్లి సోనియా ఇంటికి వెళ్లారు. 


నో రిలీఫ్..


పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్‌కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేయగా...దాన్ని గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. 2019 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై ఓ బీజేపీ ఎంపీ సూరత్ కోర్టుని ఆశ్రయించారు. రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు..ఈ ఏడాది మార్చి 23న రాహుల్‌ని దోషిగా తేలుస్తూ సంచలన తీర్పునిచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అప్పటి నుంచి రాహుల్ దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే...సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ...కోర్టు మాత్రం ఆ పిటిషన్‌ని నిరాకరించింది. జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్‌తో కూడిన సింగిల్ బెంచ్ దీన్ని కొట్టివేసింది. ఇదే కేసులో లోక్‌సభ సభ్యత్వమూ కోల్పోయారు రాహుల్. ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 (3) ప్రకారం...ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు లేదా సభ్యురాలు ఏదైనా నేరంలో దోషిగా తేలినా, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడినా ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా...లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌పై చర్యలు తీసుకున్నారు.  "రాహుల్​ గాంధీపై 10కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలయ్యాయి. వీర్​ సావర్కర్​ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా.. మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్​ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే. సూరత్​ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు  " అని గుజరాత్​ హైకోర్టు తీర్పునిచ్చింది.


Also Read: ఫ్లైఓవర్‌ కింద ప్లాస్టిక్ బ్యాగ్‌లో మహిళ తల, మరో సంచిలో మిగతా భాగాలు - ఢిల్లీలో దారుణం