Bharat Jodo Nyay Yatra Break: భారత్ జోడో న్యాయ్ యాత్రకు కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi ) తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.  అస్సాం (Assom)నుంచి పశ్చిమ బెంగాల్‌ (West Bengal )లోకి  యాత్ర ప్రవేశించింది. కూచ్‌బెహర్‌ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. రెండు రోజుల తర్వాత జనవరి 28 నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ తెలిపింది. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు రెండు రోజులు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమిలోని నేతలు ఒక్కొక్కరు షాకిస్తున్న వేళ...రాహుల్ గాంధీ జోడో యాత్రకు బ్రేక్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.  నితీష్ కుమార్ (Nitish Kumar) కూటమిని వీడితే అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. 


సొంతంగా పోటీ చేస్తామంటోన్న మమతా, కేజ్రీవాల్


టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇండియా కూటమికి దూరం అవుతున్నారు. దీంతో కూటమి నేతలకు సర్ది చెప్పేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లారన్న వార్తలు వస్తున్నాయి. మొన్న మమతా బెనర్జీ, నిన్న ఆప్ లు...పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించాయి. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...బీజేపీ కలిసిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా...బీజేపీ నేతలతో కలిసి నితీష్ కుమార్...ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్తారు. నితీష్ కుమార్ ను శాంతింపజేసేందుకు లాలు ప్రసాద్ యాదవ్ రంగంలోకి దిగారు. నితీష్ కుమార్ తో ఫోన్ లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 


తమ ప్రతిపాదనను కాంగ్రెస్ పట్టించుకోలేదన్న మమత
పార్లమెంట్ సీట్ల సర్దుబాటుపై తాను చేసిన ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, అందుకే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో ఆ పార్టీతో ఎలాంటి సంబంధం ఉండబోదని, జాతీయస్థాయిలో సంబంధాల పైనా పునరాలోచిస్తామన్నారు. ఆమె ప్రకటన చేసిన తర్వాత ఆప్ కూడా...హస్తం పార్టీకి ఝలక్ ఇచ్చింది. అన్ని చోట్ల ఒంటరిగానే పోటీ చేస్తామని...కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోమని ప్రకటించింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ బరిలోకి దిగుతుందని ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ తెలిపారు. 


జోడోయాత్ర రూట్ మార్పు


అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ లో యాత్ర ప్రవేశించినప్పటికీ...అనూహ్యంగా చివరి క్షణాల్లో రూటును మార్చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఖరారు చేసిన దారిలో కాకుండా...కొత్త రూట్ ను ఎంపిక చేశారు.  బెంగాల్ లోని ఉత్తర ప్రాంతాల్లో యాత్రను త్వరగా కంప్లీట్ చేసి....బిహార్‌లోకి వెళ్లేలా మార్గాన్ని మార్చేశారు.