Aditya L1 News: సూర్యుడిపై పరిశోధనే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపడుతున్న తొలి మిషన్ ఆదిత్య ఎల్ - 1 ప్రయోగానికి అంతా సిద్ధం అవుతోంది. ప్రయోగానికి ఇంకో మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. లాంచ్ రిహార్సల్స్‌తో పాటు రాకెట్‌లో ఇంటర్నల్ చెక్స్ అన్ని పూర్తి అయినట్లుగా ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


సెప్టెంబరు 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ - 1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ 57 రాకెట్ నింగిలోకి మోసుకొని వెళ్లనుంది. ఈ ఆదిత్య ఎల్ - 1 శాటిలైట్ ను భూమికి సూర్యుడికి మధ్య ఉన్న లాంగ్రేజ్ 1 పాయింట్ (ఎల్ - 1) వద్ద ఉంచి అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధన చేయనున్నారు. ఎల్ - 1 పాయింట్ వద్ద ఆదిత్య శాటిలైట్ ను  మోహరించడం ద్వారా నిరంతరాయంగా శాటిలైట్ సూర్యుడిపై పరిశోధన చేయనుంది. చంద్ర, సూర్య గ్రహణాల సమయంలో కూడా నిరంతరంగా సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి వీలుపడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రేజ్‌ పాయింట్‌ - 1 ఉంటుంది. 






ఏడు పేలోడ్స్ ద్వారా పరిశోధనలు


ఇందుకోసం ఆదిత్య ఎల్‌-1 ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తోంది. సూర్యుడి నుంచి వచ్చే సౌర తుపానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులపై రీసెర్చ్ చేయనుంది. ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి బయటి పొర (కరోనా)పై పరిశోధన చేయడంలో ఈ పేలోడ్స్ ఉపయోగపడనున్నాయి. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను తయారు చేశాయి.






చంద్రయాన్ 3పై ఇస్రో అప్‌డేట్..


చంద్రయాన్ 3కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది ఇస్రో. చంద్రుడి సౌత్‌పోల్‌పై ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి డేటాని పంపిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ విక్రమ్‌ని (Lander Vikram) ఫొటో తీసి పంపింది. నావిగేషన్ కెమెరాతో ఈ ఫొటో క్లిక్ చేసింది. చంద్రుడిపై ల్యాండ్ అయిన తరవాత ప్రజ్ఞాన్ రోవర్‌ తీసిన తొలి ఫొటో ఇదే. ఇప్పటి వరకూ అక్కడి నుంచి వచ్చిన ఫొటోలు, వీడియోలు అన్నీ ల్యాండర్ విక్రమ్ తీసినవే. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించింది. ట్విటర్‌లో విక్రమ్ ల్యాండర్ ఫొటోని షేర్ చేసింది. "Image of the Mission" అంటూ పోస్ట్ చేసింది. రోవర్‌పై ఉన్న NavCams (నావిగేషన్ కెమెరా)ని బెంగళూరుకి చెందిన Electro-Optics Systems కంపెనీ తయారు చేసింది. ఇప్పటికే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి కీలక వివరాలు అందిస్తోంది చంద్రయాన్ 3. ప్రపంచ దేశాల్లో ఎవరి వద్దా లేని అత్యంత అరుదైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇటీవలే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.