Venkaiah Naidu Padma Vibhushan: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందించారు. సోమవారం (ఏప్రిల్ 22) సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇంకా సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది. 


నేడు సగం మందికే ప్రదానం
నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ గవర్నర్ రామ్ నాయక్, గాయని ఉషా ఉతుప్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్‌లకు పద్మభూషణ్ ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దాదాపు 67 మంది ప్రముఖులకు నేడు (ఏప్రిల్ 22) అవార్డులు అందజేశారు. మిగిలిన అవార్డులను వచ్చే వారం ప్రదానం చేసే అవకాశం ఉంది. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.


Also Read: ఎలక్షన్స్‌పైనా వడగాలుల ఎఫెక్ట్, ఎన్నికల సంఘం కీలక భేటీ


9 మందికి మరణం తర్వాత
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను మూడు రకాలుగా ఇచ్చే సంగతి తెలిసిందే. వీటిలో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఉన్నాయి. వివిధ రంగాలలో విశేషంగా పని చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తుంటారు. వీటిలో కళలు, సోషల్ వర్క్, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు లాంటివి ఉంటాయి. ఈ ఏడాది పద్మ అవార్డులు అందుకోనున్న వ్యక్తుల జాబితాలో 30 మంది మహిళలు కూడా ఉన్నారు. అలాగే 9 మందికి మరణం తర్వాత పద్మ పురస్కారాలు లభించాయి. వీరి తరపున వారి వారసులు పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి స్వీకరిస్తారు.


ఇంకా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 132 మంది వ్యక్తులకు గణతంత్ర దినం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 25న ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డులను అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా భావిస్తారు.


Also Read: Hyderabad బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు హగ్, సైదాబాద్ ఏఎస్ఐ సస్పెండ్