ఎస్సీ రిజర్వేషన్లలో సబ్-కేటగిరైజేషన్ ప్రక్రియలో భాగంగా మరో కదలిక వచ్చింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (నవంబరు 24) కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని కొన్ని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. 


తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేళ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ సభలో ప్రధాని మోదీ దీనిపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం కమిటీని నియమిస్తున్నట్లుగా ప్రధాని మోదీ అదేశాలు ఇచ్చారు. 


మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) గత 30 ఏళ్లుగా పోరాడుతోంది. దీన్ని మందక్రిష్ణ మాదిక స్థాపించారు. గత మూడు దశాబ్దాలుగా జరిగిన ప్రతి పోరాటంలో బీజేపీ వారికి అండగా నిలుస్తోందని ఇటీవల తెలంగాణలో హైదరాబాద్ లో జరిగిన సభలో మోదీ అన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. మాదిగలకు సాధికారత కల్పించడానికి ఓ కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఎమ్మా్ర్పీఎస్ పోరాటం న్యాయమైనదని తాము భావిస్తున్నట్లు చెప్పారు.


మాదిగలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని షెడ్యూల్డ్ కులాలలో (ఎస్సీ) ఎక్కువ భాగం ఉన్నారు. దీనివల్ల ఉద్యోగాలు సహా ఇతర విషయాల్లో రిజర్వేషన్లు, ఇతర బెనిఫిట్స్ తమకు అందడం లేదని వాదన వారిలో ఉంది. అందుకే ఎమ్మార్పీఎస్ గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతోంది.