SSC JE Hall Ticket 2023: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ పేపర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 24న విడుదల చేసింది. రీజియన్లవారీగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జూనియర్ ఇంజినీర్ పేపర్-2 పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 4న జేఈ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 


జేఈ పేపర్-2 అడ్మిట్‌కార్డుల (రీజియన్లవారీగా) కోసం క్లిక్ చేయండి..


పేపర్-2 పరీక్ష విధానం..
మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. పరీక్షలో మొత్తం మూడు విభాగాలుంటాయి. ఇందులో పార్ట్-ఎ: జనరల్ ఇంజినీరిగ్(సివిల్ & స్ట్రక్చరల్), పార్ట్-బి: జనరల్ ఇంజినీరిగ్(ఎలక్ట్రికల్), పార్ట్-సి: జనరల్ ఇంజినీరిగ్(మెకానికల్), ఉంటాయి. ఆబ్జెక్టివ్, మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (Junior Engineer) ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commissions) నవంబరు 17న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలకు సంబంధించి పేపర్‌-1లో మొత్తం 12,227 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సివిల్ విభాగంలో 10,154 మంది అభ్యర్థులు; మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 2073 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 4న పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. 


కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసిన సంగతి తెలిసిదే. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని 1324 జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అభ్యర్థులకు అక్టోబరు 9-11 మధ్య టైర్-1 పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ఫలితాలను నవంబరు 17న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. పేపర్‌-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పేపర్‌-2 పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..