Nithyananda Swami Latest News: స్వయం ప్రకటిత భగవంతుడైన నిత్యానంద స్వామి తన కైలాస దేశం గురించి కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రకటించారు. 'కైలాస' పేరుతో దేశాన్ని సృష్టించినట్లు ఆయన గతంలో చెప్పుకున్న సంగతి తెలిసిందే. భౌగోళికంగా ఆ దేశం ఎక్కడ అనే అంశంపై ఇప్పటిదాకా ఎలాంటి ఆనవాళ్లు లేవు. దీనిపై నిత్యానంద జూలై 21వ తేదీన తన కైలాస దేశం భౌగోళిక స్థితిగతుల్ని వెల్లడిస్తానని చెప్పారు. 


అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద 2019లో భారతదేశం నుండి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' అని స్థాపించారు. అయితే, ఆ దేశపు కచ్చితమైన భౌగోళిక స్థానం ఎక్కడో ఎవరికీ తెలియదు. కైలాస దేశానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు తప్ప అది నిజంగా ఎక్కడ ఉందనే దానిపై ఎలాంటి రుజువులు లేవు. ఇలాంటి పరిస్థితిలో నిత్యానంద తన కౌలాస దేశపు భౌగోళిక స్థానాన్ని వెల్లడిస్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


‘‘కైలాస దేశపు తలుపులు తెరుచుకున్నాయి. ఇక అందరికీ స్వాగతం. చాలా కాలం నుంచి వెయిటింగ్ ఎట్టకేలకు ముగిసింది. అనేక సంవత్సరాల ఊహాగానాలు.. ఉత్సుకత తర్వాత, కైలాస దేశం తన ఉనికిని ఆవిష్కరించడానికి రెడీగా ఉంది. మీరు పుకార్లు విన్నారు, ఇది నిజమేనా అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సమాధానాల కోసం రెడీగా ఉండండి! ఈ గురు పూర్ణిమకు, కైలాస దేశం ప్రపంచానికి తన తలుపులు తెరుస్తుంది. ఇదొక చరిత్ర.


అంతేకాదు! ఇంకొక అద్భుతమైన అవకాశం కూడా ఉంది. హిందువుల కోసం ఉన్న ఈ మొదటి కైలాస దేశంలో భౌతికంగా ఇక్కడ పౌరుడిగా మారడానికి మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చరిత్ర క్రియేట్ చేయడానికి ఇది మీకు అవకాశం. జీవితంలో ఒక్కసారైనా లభించే ఈ అవకాశాన్ని వదులుకోకండి. కైలాసవాసిగా కొత్త జీవితానికి రెడీనా?’’ అని నిత్యానంద అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఓ పోస్టు చేశారు.