Hathras Stampede: యూపీలోని హత్రాస్‌లో జూలై 2న భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనను యూపీ సీఎం యోగి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ దారుణానికి బాధ్యులైన వారి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించదని స్పష్టం చేసింది.  భోలే బాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి, ఘటనపై విస్తృతస్థాయిలో విచారణ జరిపింది. ఆ నివేదికను మంగళవారం యోగి ప్రభుత్వానికి సిట్ సమర్పించింది. సిట్ నివేదిక తర్వాత యోగి ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. ఈ కేసులో స్థానిక ఎస్‌డిఎం, సిఓ, తహసీల్దార్‌తో సహా ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ అధికారుల నిర్లక్ష్యాన్ని సిట్ తన 300 పేజీల నివేదికలో పేర్కొంది.


125 మంది వాంగ్మూలాలు నమోదు
సిట్ తన 300 పేజీల నివేదికలో 125 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. సత్సంగానికి అనుమతి ఇచ్చిన హత్రాస్ డీఎం ఆశిష్ కుమార్, ఎస్పీ నిపున్ అగర్వాల్, ఎస్‌డీఎం, సీఓ సికిందరావు, జూలై 2న సత్సంగ్ డ్యూటీలో మోహరించిన పోలీసుల వాంగ్మూలాలు ఇందులో ఉన్నాయి. ఈ నివేదికలో సత్సంగాన్ని నిర్వహించిన కమిటీని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే అందులో భోలే బాబా పేరు ప్రస్తావనకు రాలేదు. ఈ ఘటనకు  సత్సంగ్ నిర్వాహకులను ప్రధాన బాధ్యులుగా సిట్ తన నివేదికలో పేర్కొంది.  పోలీసులు, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటూ వాస్తవాలను దాచిపెట్టారని సిట్ నివేదికలో పేర్కొన్నారు.


ఈ కార్యక్రమానికి భారీగా భక్తులను ఆహ్వానించి వారికి కనీస ఏర్పాట్లు చేయలేదని ఆరోపించింది. ఎలాంటి పోలీసు వెరిఫికేషన్‌ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారు. భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా లేవని సిట్ తెలిపింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరగ్గానే నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడినుంచి పారిపోయినట్లు సిట్‌ (SIT Report) తన నివేదికలో వెల్లడించింది. సత్సంగానికి దాదాపు 7 లక్షల మందిని సమీకరించారు. అదేవిధంగా జనాలను నియంత్రించేందుకు వేదిక వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్న సమయంలోనే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందన్న అనుమానాన్ని కూడా సిట్ వ్యక్తం చేసింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని సిట్ సిఫారసు చేసింది.


ఆరుగురు అధికారులు సస్పెండ్
సత్సంగ్‌ జరిగే వేదిక ప్రాంగణాన్ని తనిఖీ చేయకుండా.. కనీసం సీనియర్లకు సమాచారం అందించకుండానే  సబ్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ ఈ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చారని సిట్‌ తెలిపింది. సర్కిల్‌ ఆఫీసర్‌, రెవెన్యూ అధికారి, ఇన్‌స్పెక్టర్‌, ఔట్‌పోస్ట్‌ ఇన్‌ఛార్జ్‌ అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది. వీరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేసింది.  సిట్ నివేదిక ఆధారంగా యూపీ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. స్థానిక సబ్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌, సర్కిల్‌ అధికారితో పాటు మరో నలుగురిని మంగళవారం సస్పెండ్ చేసింది. జూలై 2న హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల బంధువులు, గాయపడిన భక్తుల వాంగ్మూలాలను నివేదికలో నమోదు చేశారు.   


ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ అరెస్ట్
ఈవెంట్ నిర్వాహకుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో పోలీసు బృందం నిమగ్నమైంది. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై సూరజ్‌పాల్ అలియాస్ 'భోలే బాబా' మీడియాతో మాట్లాడుతూ..  జూలై 2 సంఘటన తర్వాత చాలా బాధపడ్డామని చెప్పారు. ఈ దుఃఖం నుండి బయటపడే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. అన్ని ప్రభుత్వం, పరిపాలనపై నమ్మకాన్ని ఉంచండి. దోషులను విడిచిపెట్టబోరన్న నమ్మకం మాకుంది. నేను నా లాయర్ ని సంప్రదించాను. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని, జీవితాంతం వారికి సహాయం చేయాలని కమిటీ సభ్యులను భోలే బాబా అభ్యర్థించారు.