Four Telugu people   arrested in uman trafficking Case : అమెరికాలో తెలుగు యువతీయువకులు ముఠాగా ఏర్పడి నిర్వహిస్తున్న  మనుషుల అక్రమ రవాణాను అక్కడి పోలీసులు అరికట్టారు. చదువులు,  ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మహిళలు, పురుషులను నిర్బంధించి అతి తక్కువ జీతాలనికి వెట్టి చాకిరీకి పాల్పడుతున్నారు.  షెల్ కంపెనీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాళ్లతో పని చేయించుకుంటున్నారు.  ప్రిన్స్ టన్ పోలీసులకు సమాచారం రావడంతో వారు ఉంటున్న అపార్టుమెంట్ పై దాడి చేశారు. నిజమే అని తేలడంతో బాధితులకు విముక్తి కల్పించి నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. 


అరెస్ట్ అయిన వారిలో  చందన్ దాసిరెడ్డి, ద్వారక గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే ఉన్నారు.  అపార్ట్మెంట్ లో ఎక్కువ మంది ఉండటం గమనించిన పెస్ట్ కంట్రోల్ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో ఈ ముఠాను పోలీసులు పట్టుకోగలిగారు.  మార్చ్ 13, 2024న అతని నుండి ఫిర్యాదు అందుకున్న ప్రిన్స్ టన్ పోలీసులు ఆ అపార్ట్మెంట్ తనిఖీ చేశారు. ఈ ముఠా ఒక్క ప్రిన్స్ టన్ లో మాత్రమే కాకుండా మెలిస్సా, మిక్ కెన్నీ వంటి ఇతర నగరాల్లో కూడా అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడినట్లు   పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి లాప్ టాప్స్, సెల్ ఫోన్స్, ప్రింటర్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. డ‌ల్లాస్ కేంద్రంగా ఇదంతా జ‌రుగుతోంద‌ని... ఓ భార‌త ఏజెన్సీలోని న‌లుగురు త‌మ‌తో బ‌ల‌వంతంగా ప‌ని చేయిస్తున్నార‌ని ప‌ట్టుబ‌డ్డ నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. 


ఇటీవల బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు తెలుగువారిపై ఎక్కువగా నమోదవుతున్నాయి. గత డిసెంబర్‌లో  సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు.   అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్‌ చేయడం సహా అనేక నేరాల కింద కేసు నమోదు చేశారు.  ఇరవై ఏళ్ల యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడని కేసు నమోదు అయింది.  చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేస్తున్నాడు. పీవీసీ పైపులతో కొడుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలుకూడా నిద్రపోనీయకుండా పని చేయించుకుంటూ… పదే పదే హింహిస్తూండటంతో ఆ ఇరవై ఏళ్ల యువకుడు పూర్తిగా బలహీనపడ్డాడు. ఇతని పరిస్థితి చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. 


చదువులు, ఉపాధి కోసం అమెరికా వెళ్తున్న వారు అక్కడకు వెళ్లాకా ఇబ్బంది పడుతున్నారు. కనీస అవసరాలకు డబ్బులు లేక చిన్న చిన్న ఉద్యోగాలు అయినా చేసుకుంటున్నారు. ఇలాంటి వారి అవసరాలను గుర్తించి.. వారితో వెట్టి చాకిరీ చేయించుకునే  ప్రయత్నం చేయడంతో తెలుగువాళ్లు అరెస్టవుతున్నారు. బాధితుల్లో కూడా ఎక్కువ మంది తెలుగువాళ్లే ఉంటున్నారు.