National Herald Case: విచారణ వాయిదా వేయండి, హాజరుకాలేను: ఈడీకి సోనియా లేఖ

ABP Desam   |  Murali Krishna   |  22 Jun 2022 04:51 PM (IST)

National Herald Case: ఈడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఈడీ విచారణ వాయిదా వేయాలని కోరారు సోనియా గాంధీ.

(Image Source: PTI)

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను కొద్దిరోజులు వాయిదా వేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కాంగ్రెస్ అధినేత్రి కోరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నానని, పూర్తిగా ఆరోగ్యం కుదుటపడేవరకు విచారణకు హాజరుకాలేనని ఆమె ఈడీకి లేఖ రాశారు. ఈ కేసులో జూన్ 23న సోనియా గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. 

కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలతో సోనియాగాంధీ బాధపడుతున్నారు. సుమారు తొమ్మిది రోజుల పాటు సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనాతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యల వల్ల సోనియా విశ్రాంతి తీసుకోవాలని డిశ్చార్జి సమయంలో వైద్యులు సూచించారు. అందుకే కొద్దివారాల పాటు విచారణకు హాజరుకావడాన్ని వాయిదా వేయాలని సోనియా గాంధీ ఈడీకి లేఖ రాశారు.                                                     -   జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఇదీ కేసు

కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.

ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌ తదితరులు ఉన్నారు.

Also Read: Presidential Election 2022: చీపురు పట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము- Z+ భద్రత కల్పించిన కేంద్రం

Also Read: Maharashtra Political Crisis: 'మహా' రాజకీయంలో మరో మలుపు- సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్

Published at: 22 Jun 2022 04:42 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.