భర్తను కాదని మాజీ ప్రియుడి కోసం పరారీ


ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. నువ్వు లేక నేను లేను అని కబుర్లు చెప్పుకున్నారు. ఇంట్లో వాళ్లు కాదన్నా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అంతా హ్యాపీగా సాగిపోతుందనుకుంటున్న జీవితంలో అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. ఈ ట్విస్ట్‌కి ఆ అబ్బాయి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక గొల్లుమంటున్నాడు. ఎందుకీ బాధ అంటే...తన ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ కోసం భర్తను కాదని వెళ్లిపోయింది ఆ అమ్మాయి. ఒట్టి చేతుల్తో కాదు. డబ్బు, నగలతో పరారైంది. పాట్నాలోని నౌబత్‌పూర్‌లో జరిగిందీ ఘటన. అమ్మాయి మోసం చేసిందని అర్థం చేసుకున్న ఆ కుర్రాడు పోలీసులను ఆశ్రయించాడు. 
 
మాజీ బాయ్‌ ఫ్రెండ్‌తోనే ఉండిపోతానంటూ వాగ్వాదం


సేఫ్‌ లాక్‌లు బద్దలుకొట్టి రూ. 20వేల నగదుతో పాటు మంగళసూత్రం, మరి కొన్ని నగల్ని తీసుకుని అమ్మాయి పరారైనట్టు పోలీసులకు వెల్లడించాడు బాధితుడు. పెళ్లికి గిఫ్ట్‌గా ఇచ్చిన నగలన్నీ తీసుకెళ్లిపోయిందని వాపోయాడు. రెండేళ్ల క్రితమే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. 
గంటల తరబడి కాల్స్‌ మాట్లాడుకునే వాళ్లు. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయానికి పెద్దలు అంగీకరించలేదు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఏప్రిల్ 27వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఓ రోజు ఆ అమ్మాయి వేరెవరితోనో చాటింగ్ చేస్తుండటాన్ని గమనించాడు బాధితుడు. ఎవరని నిలదీశాడు. "తను నా మాజీ బాయ్‌ఫ్రెండ్ అని, తనతోనే బతకాలనుందని" షాక్ అయ్యే సమాధానమిచ్చింది ఆ కొత్త పెళ్లికూతురు. ఈ విషయమై ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఎప్పుడైతే అబ్బాయి నిద్రపోయాడో వెంటనే లాకర్లు బద్దలుకొట్టి డబ్బు, నగదుతో వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పెళ్లి చేసుకుని, చివరకు మాజీ ప్రియుడిని మర్చిపోలేనంటూ కొందరు అమ్మాయిలు వెళ్లిపోతున్నారు. అటు అబ్బాయిలూ ఇదే తరహాలో పరారవుతున్నారు. డబ్బు కోసం ఇలా పెళ్లాడి, అవసరం తీరాక కంటికి కనిపించకుండా పోతున్నారు. ఇలాంటి కేసులు పోలీసులకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. ఇంకాసేపట్లో పెళ్లి ఉందనగా, వెళ్లిపోతున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం చౌకిళ్లవారిపల్లె గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మబలికాడు ఓ యువకుడు. అయితే తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పడంతో వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు పెళ్లి వేడుకలకు సిద్దం చేశారు. వధువు, వరుడి తల్లిదండ్రులు కలిసి వివాహ వేడుకలకు అవసరం అయ్యే బంగారు నగలు, నూతన వస్త్రాలు సైతం కొనుగోలు చేశారు. అనుకున్న విధంగానే వివాహ వేడుకలను నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో గానీ తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చిందని అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులను నమ్మించి, వారి వద్ద నగదు, నగలు తీసుకుని స్వగ్రామానికి వెళ్తున్నట్లు నమ్మించి పరారయ్యాడు.