ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 100 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ, అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితమే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.


తన తల్లి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘ఒక అద్భుతమైన శతాబ్ది భగవంతుని పాదాలను చేరింది. నా తల్లిని నేను ఎప్పుడూ త్రిమూర్తులుగా భావించాను. ఆమె ఒక నిస్వార్థ కర్మయోగికి ప్రతీక. విలువల స్వరూపం, నిబద్ధతతో కూడిన జీవితం కలిగి ఉన్నారు.’’ అని ట్వీట్ చేశారు.


‘‘తన 100వ పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిసినపుడు నాతో ఒక మాట అన్నారు, పని తెలివితేటలతో, స్వచ్ఛతతో జీవించు, ఎప్పుడూ తెలివితో పని చేయండి, స్వచ్ఛతతో కూడిన జీవితాన్ని గడపాలి అని చెప్పారు అది ఎప్పుడూ గుర్తుంటుంది’’ అని మరో ట్వీట్ చేశారు.






గాంధీనగర్‌లో అంత్యక్రియలు


గాంధీనగర్‌లో హీరాబెన్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సెక్టార్ 30లోని సంస్కార్ ధామ్‌లో అంత్యక్రియలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఏడున్నర గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. హీరాబెన్ పార్థివదేహాన్ని మోదీ సోదరుడు పంకజ్‌  నివాసంలో ఉంచారు.


బుధవారం (డిసెంబరు 28) మధ్యాహ్నం తల్లి హీరాబెన్‌ను ఆస్పత్రిలో చేర్పించగానే ప్రధాని మోదీ వెంటనే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లి ఆస్పత్రిలో తన తల్లిని కలిశారు. దాదాపు గంటకు పైగా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌కు ముందు కూడా ప్రధాని తన తల్లి హీరాబెన్‌ను కలిసేందుకు వెళ్లారు. కర్ణాటకలోని మైసూర్‌లో కారు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ గాయపడిన ఒక రోజు తర్వాత హీరాబెన్ మోదీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి.


హీరాబెన్ గాంధీనగర్ నగరానికి సమీపంలోని రైసన్ గ్రామంలో ప్రధాని మోదీ తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి హీరాబెన్ ఉంటున్నారు. ప్రధాని గుజరాత్‌కు వచ్చినప్పుడల్లా రైసన్‌కు వెళ్లి తన తల్లిని కలిసేవారు.