Manipur Violence: 


హింసను ఆపడమెలా..? 


కాలాన్ని వెనక్కి తిప్పలేం. జరిగిందేదో జరిగింది. మరి పరిష్కారమేంటి..? మణిపూర్‌ హింస గురించి ఇలా వేదాంత ధోరణిలోనే మాట్లాడుకోవాలేమో. అక్కడ పరిస్థితి అలా ఉంది. ఏదో ఒకటి చేసి హింసను ఆపకపోతే...ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో ఊహించడం కూడా కష్టమే. రాష్ట్రం ప్రశాంతంగా మారాలంటే ఇప్పటికిప్పుడు బీజేపీ ఏదో ఓ వ్యూహం అమలు చేయక తప్పదు. అది కూడా రెండు తెగలనూ మెప్పించే విధంగా ఉండాలి. చెప్పాలంటే...ఇది ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాకి పెద్ద సవాలే. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే...మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో 40 స్థానాల్లో మైతేయి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. మిగతా 20లో ఒక స్థానాన్ని షెడ్యూల్ కులానికి రిజర్వ్ చేయగా...మరో 19ని షెడ్యూల్ తెగకు కేటాయించారు. ఇప్పుడు మైతేయిలకు ST హోదా ఇస్తే...ఉన్న 19 సీట్లు కూడా వాళ్ల అధీనంలోకే వెళ్లిపోతాయి.


ఇప్పటికే మైతేయిల డామినేషన్ పెరిగిపోయిందని కుకీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు రిజర్వేషన్‌లు కూడా ఇస్తే పూర్తి స్థాయిలో మణిపూర్‌ని వాళ్లు హస్తగతం చేసుకుంటారన్న అలజడి కుకీ తెగలో మొదలైంది. రాష్ట్రంలో 41%కి పైగా హిందువులున్నారు. వీరిలో అత్యధిక జనాభా మైతేయిలదే. క్రిస్టియన్‌లు కూడా దాదాపు 41% మంది ఉన్నారు. 8.4% మంది ముస్లింలున్నారు. మెజార్టీ మైతేయిలదే అంటే..హిందువులదే అని స్పష్టంగా అర్థం అవుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే...మెజార్టీ వర్గానికి ST హోదా ఇవ్వాలని హైకోర్టు ప్రతిపాదించింది. అందుకే...కుకీలకు అంత కోపం. ఉన్న ఆ కాస్త రాజకీయ ఉనికినీ లాగేసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 


వేరువేరు పరిపాలనా వ్యవస్థలు..!


ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు సాధించడానికి బీజేపీ ఎన్నో దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తోంది. ఇన్నాళ్లకు ఆ పార్టీ అక్కడ బలం పుంజుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి చెందిన నేత ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. మూడు రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాషాయ పార్టీ. మిగతా రాష్ట్రాల్లోలాగా ఇక్కడ మత రాజకీయాలు చేస్తామంటే కుదరదు. కచ్చితంగా స్థానిక తెగలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా హింస తీవ్ర స్థాయిలో చెలరేగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి..? అన్నదే బీజేపీ ముందున్న పెద్ద ప్రశ్న. దీనిపై చాలా మంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సూచనలిస్తున్నారు. ఇందులో మొట్టమొదటిగా వినిపిస్తున్న మాట అధికారాన్ని సమంగా పంచడం. అంటే పవర్ షేరింగ్.


మిజోరం బీజేపీ ఎంపీ ఒకరు ఇదే సూచన చేశారు. మైతేయి వర్గానికి, కుకీ వర్గానికి వేరువేరుగా పరిపాలనా వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తే...మణిపూర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సూచించారు. అంటే కొండ ప్రాంతాల్లో నివసించే వారికి పూర్తిగా స్పెషల్ అడ్మినిస్ట్రేషన్‌ ఏర్పాటు చేయాలి. కుకీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత రాజ్యాంగ నిబంధనలు అనుసరిస్తూనే కొత్త అడ్మినిస్ట్రేషన్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు. అవసరమైతే వాళ్ల భూభాగాన్ని మిజోరంలో కలిపేయాలనీ చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రెండు తెగలకూ స్పెషల్ ఐడెంటిటీ వస్తుందని అంటున్నారు. ఇలా చేస్తే రాజకీయంగానే కాకుండా ఆర్థికంగానూ ఎదిగేందుకు రెండు వర్గాల ప్రజలకూ అవకాశాలుంటాయి. కానీ...ఇదేమంత సులువైన పని కాదు. అసలు బీజేపీ ఈ ఆలోచన చేస్తోందా లేదా అన్నదీ ప్రస్తుతానికి క్లారిటీ లేదు.  


Also Read: కరవమంటే కప్పకు కోపం వదలమంటే పాముకి కోపం, మణిపూర్‌ విషయంలో ఇరకాటంలో బీజేపీ!