Manipur Violence: 



సున్నితమైన అంశం..


సాధారణంగా దేశంలో ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా వెంటనే కేంద్రహోం శాఖ అప్రమత్తమై వాటిని కంట్రోల్ చేసేస్తుంది. వీలైనంత త్వరా అదుపులోకి తెచ్చేస్తుంది. కానీ..మణిపూర్‌లో ఇలా జరగడం లేదు. దాదాపు రెండు నెలలుగా అక్కడ శాంతి భద్రతలు అదుపులో లేవు. పోనీ...అక్కడ వేరే ప్రభుత్వం ఉందా అంటే అదీ కాదు. కేంద్రంలో ఉన్న బీజేపీయే రాష్ట్రంలోనూ ఉంది. అయినా...ఇక్కడ అల్లర్లు ఆగలేదు. పైగా రోజురోజుకీ తీవ్రమయ్యాయి. మరి ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు ఏమీ చేయలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం...ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతిదీ సున్నితమైన అంశమే. ఏ మాత్రం ఒకే తెగకు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించినా మరో తెగ గొడవకు దిగుతుంది. అందుకే...ఎంతో ఆచితూచి కామెంట్స్ చేస్తోంది కేంద్రం. హోం మంత్రి అమిత్‌షా మణిపూర్‌లో నాలుగు రోజుల పాటు ఉండి పరిస్థితులను సమీక్షించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన అలా వెళ్లారో లేదో మళ్లీ హింస మొదలైంది. రెండు తెగల నేతలతో అమిత్‌షా మాట్లాడినా అది కొలిక్కి రాలేదు. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకి కోపం అన్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. అందుకే...కేంద్రం ఈ విషయంలో ఎటూ తేల్చులేకపోతోంది. మరో కీలక విషయం ఏంటంటే...మణిపూర్‌ విషయంలో కేంద్రం జోక్యం ఎక్కువైతే మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ అలజడి పెరుగుతుంది. బహుశా కేంద్రం మౌనంగా ఉండడానికి ఇది కూడా ఓ కారణమై ఉంటుంది. 
 
ఆలస్యంగా స్పందించిన ప్రధాని..


అంతెందుకు...రాష్ట్రం అంతా తగలబడుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ రెండు నెలల వరకూ స్పందించలేదు. మొన్న ఓ వీడియో వైరల్ అయిన తరవాత పార్లమెంట్ సమావేశాల ముందు స్పందించారు. గుండె మండిపోతోందని అన్నారు. కానీ...విపక్షాలకు ఈ "డోస్" చాలలేదు. ఇన్ని రోజులపాటు సైలెంట్‌గా ఉండి...ఇప్పుడు మాట్లాడుతున్నారా అంటూ విమర్శిస్తున్నాయి. ఇక బీజేపీని కార్నర్ చేయడానికి మరో కారణం...ముఖ్యమంత్రిని మార్చకపోవడం. అక్కడి హింసను కంట్రోల్ చేయడంలో బైరెన్ సింగ్ పూర్తిగా విఫలమయ్యారని గట్టిగానే వాదిస్తున్నాయి విపక్షాలు. అయినా ముఖ్యమంత్రిని మార్చే విషయంలో బీజేపీ ససేమిరా అంటోంది. ఏదో విధంగా పరిస్థితులు అదుపులోకి తీసుకొస్తామని చెబుతోందే తప్ప సీఎంని మార్చేస్తామని స్పష్టంగా చెప్పట్లేదు. ఇప్పటికే రెండు సందర్భాల్లో బైరెన్ సింగ్ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. దాదాపు ఖరారే అనుకుంటున్న సమయంలో "అలాంటిదేమీ లేదు" అని తేల్చి చెప్పారు బైరెన్. కానీ...విపక్షాలు మాత్రం ఇంకా ఇదే డిమాండ్ వినిపిస్తున్నాయి. మరి...సీఎంని మార్చకుండా బీజేపీ అంత పట్టుదలగా ఉండడానికి కారణమేంటి..? 


ఇంత జరుగుతున్నా బైరెన్‌ సింగ్‌ని హైకమాండ్ సపోర్ట్ చేస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడమే తమ లక్ష్యం అని తేల్చి చెబుతోంది. బీజేపీ స్టాండ్‌ని సమర్థిస్తూ కొందరు మణిపూర్ బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. బైరెన్‌ని రీప్లేస్ చేయకపోవడానికి కారణమేంటో చెబుతున్నారు. 


"బైరెన్‌ సింగ్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం అంత సులువుకాదు. ఆయన స్థానంలో వేరే వ్యక్తిని కూర్చోబెట్టడం సరికాదు. ఒకవేళ అదే జరిగితే మైతేయిలు తాము ఓడిపోయినట్టు భావిస్తారు. తమ డిమాండ్ సరికాదన్న సంకేతాలు కేంద్రం ఇస్తోందని మండి పడతారు. అది ఇంకా హింసకు దారితీసే ప్రమాదముంది. అందుకే ప్రస్తుతానికి హైకమాండ్ ఆ ఆలోచన చేయడం లేదు"


- మణిపూర్ బీజేపీ నేతలు 


హైకమాండ్‌ స్టాండ్‌ని జస్టిఫై చేయడానికి వీళ్లు ఇలా చెబుతున్నా...ఇక్కడ మరో విషయమూ గమనించాలి. బైరెన్ సింగ్‌ని తప్పిస్తే బీజేపీ స్వయంగా ఓటమిని ఒప్పుకున్నట్టవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడలేకపోయామన్న సంకేతాలిచ్చినట్టవుతుంది. ఇది విపక్షాలకు కలిసొస్తుంది. ఇదే ఉదాహరణను చూపించి కేంద్ర హోం శాఖ వైఫల్యాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునే అవకాశముంది. అందుకే..."అంతా సద్దుమణిగేలా చూస్తాం" అని చెబుతోందే తప్ప కాన్ఫిడెంట్‌గా ఏమీ మాట్లాడడం లేదు బీజేపీ. అలా ఇరుకున పడిపోయింది. 


Also Read: పేరు గొప్ప ఊరు దిబ్బలా మణిపూర్ పరిస్థితి, దశాబ్దాల వర్గపోరుని ఆపే దారే లేదా?