Lalu Prasad: లాలూకు ఏమైంది? డిశ్ఛార్జ్ చేసి అంతలోనే ఎమెర్జెన్సీ వార్డుకు!

ABP Desam Updated at: 23 Mar 2022 06:52 PM (IST)
Edited By: Murali Krishna

లాలూ ప్రసాద్ యాదవ్‌ను మళ్లీ ఎమెర్జెన్సీ వార్డులో చేర్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు లాలూ కుమారుడు తెలిపారు.

లాలూకు ఏమైంది? డిశ్ఛార్జ్ చేసి అంతలోనే ఎమెర్జెన్సీ వార్డుకు!

NEXT PREV

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. మంగళవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ నుంచి దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే ఆయన ఆరోగ్య మెరుగుపడటంతో ఈరోజు ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.


కానీ బుధవారం మధ్యాహ్నం సడెన్‌గా మళ్లీ లాలూ ఆరోగ్యం క్షీణించింది. దీంతో మళ్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ తెలిపారు.



లాలూ జీ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం రాంచీలో చికిత్స పొందుతున్న సమయంలో ఇన్ఫెక్షన్ స్థాయి 4.5 గా ఉంది. ఆ తర్వాత దిల్లీలో పరీక్షించినప్పడు అది 5.1కి పెరిగింది. తాజాగా ఈరోజు మధ్యాహ్నం పరీక్షించినప్పడు ఇన్ఫెక్షన్ స్థాయి 5.9కి చేరుకుంది.                                                                       - తేజస్వీ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు 


ఇటీవల


దాణా కుంభకోణంలోని మరో కేసులో లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఇటీవల శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈ నెల 15నే లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ కేసులో మరో 24 మంది నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.


ఈ డోరాండ్ ట్రెజరీ కేసు కూడా దాణా కుంభకోణానికి (Fodder Scam) సంబంధించినదే. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139.35 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై ఈ కేసు నమోదైంది. ఇది దాణా కుంభకోణంలో అతిపెద్ద కేసు.


ఏంటి కేసు


దాణా కుంభకోణానికి సంబంధించి 1996లో సీబీఐ పలు కేసులు నమోదు చేసింది. 170 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో 55 మంది ఇప్పటికే మృతి చెందారు. మరో ఏడుగురిని ప్రభుత్వ సాక్ష్యులుగా సీబీఐ పేర్కొంది. మరో ఇద్దరు కోర్టు తీర్పు రాకముందే తప్పుచేశామని ఒప్పుకున్నారు. ఆరుగురు ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారు. మరో 99 మంది తీర్పు కోసం వేచి చూస్తున్నారు.


లాలూ ప్రసాద్‌తో పాటు మాజీ ఎంపీ జగదీశ్ శర్మ, డా. ఆర్‌కే రాణా సహా పలువురు ఈ డోరాండా ట్రెజరీ కేసులో నిందితులుగా ఉన్నారు.


బెయిల్


దాణా కుంభకోణానికి సంబంధించిన గత నాలుగు కేసుల్లో లాలూకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఈ కేసులు అన్నింటిలోనూ లాలూకు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


బిహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో రూ.950 కోట్ల దాణా కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో 1996లో ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ 53 కేసులు నమోదు చేసింది.

Published at: 23 Mar 2022 06:52 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.