Kerala Police:


కేరళ పోలీసులకు వింత అనుభవం..


కేరళలోని కొట్టాయంలో ఓ డ్రగ్స్ డీలర్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన Anti-Narcotics Squad పోలీసులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఖాకీ డ్రెస్ వేసుకున్న వాళ్లను కరిచే విధంగా ట్రైనింగ్ ఇచ్చిన కుక్కలు ఆ ఇంట్లో కనిపించాయి. అవి చాలా క్రూరంగా ఉన్నాయట. ఫలితంగా సోదాలు చేయడం పోలీసులకు సవాలుగా మారింది. అవి నిందితుడైన యజమాని తప్పించుకునేందుకు సహకరించడమే కాదు. డ్రగ్స్‌ని సీజ్ చేయకుండా కూడా ఆపేశాయని పోలీసులు వెల్లడించారు. వాటికి ఆ రేంజ్‌లో ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. చాలా సేపు శ్రమించి మొత్తానికి ఆ కుక్కల్ని లొంగదీసుకున్నారు పోలీసులు. ఆ తరవాత ఇంట్లో సోదాలు చేసి 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొట్టాయం పోలీసులకు ఎదురైన ఈ వింత అనుభవం గురించి కేరళ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొట్టాయం ఎస్‌పీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పడం వల్ల ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా కూడా కుక్కలకు ట్రైనింగ్ ఇస్తారా అని షాక్‌ అవుతున్నారు. 


"అర్ధరాత్రి మా సెర్చ్ టీమ్ నిందితుడి ఇంటికి సర్‌ప్రైజ్‌ సెర్చ్‌కి వెళ్లింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు కూడా మాకు సహకరించారు. కానీ మేం లోపలికి వెళ్లగానే షాక్ అయ్యాం. చాలా కుక్కలు కనిపించాయి. పైగా అవి చూడడానికి క్రూరంగా ఉన్నాయి. అందుకే సెర్చ్ ఆపరేషన్ చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ఎవరిపైనా అవి దాడి చేయలేదు. ఖాకీ డ్రెస్‌ వేసుకున్న ప్రతి ఒక్కరినీ కరిచే విధంగా ఆ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చారు. BSF నుంచి రిటైర్ అయిన వ్యక్తి నుంచి కుక్కలకు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో నిందితుడు నేర్చుకున్నాడు"


- కొట్టాయం పోలీసులు


కొనసాగుతున్న విచారణ..


ఇంకా కీలక విషయం ఏంటంటే పైకి అలా డాగ్ ట్రైనర్‌గా కనిపిస్తూనే అక్రమంగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. చాలా రోజులుగా ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. చాలా మంది తమ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు వాటిని ఇక్కడే వదిలి వెళ్తున్నారు. అందుకోసం రోజుకి రూ.1000 ఛార్జ్ చేశాడని స్థానికులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. సోదాలు చేయడానికి వెళ్లినప్పుడు 13 కుక్కలు కనిపించాయి. స్పెషల్ టీమ్‌తో ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుపుతున్నట్టు వివరించారు. 


పోలీసులకు కేవలం కుక్కలు మాత్రమే సాయం చేస్తాయి, పోలీసులు మిగతా జంతువుల సాయం తీసుకోరు అనుకుంటే పొరబడినట్లే. పలు సందర్భాల్లో జంతువులు చేసే సాయం వల్ల నేరస్థులను పట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇథియోపియాలో మూడు సింహాలు 12 ఏళ్ల బాలిక ప్రాణాను కాపాడాయి. ఏడుగురు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి ఓ చోట దాచారు. వారిని చూసి భయపడ్డ ఆ పాప గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపు విన్న పక్కనే అడవిలో ఉన్న సింహాలు ఆ ఇంటి వద్దకు వచ్చి కాపు కాశాయి. వాటికి ఏదైన వేట దొరుకుతుందని ఎదురుచూడగా.. సింహాలు బయట ఉండటంతో లోపల ఉన్న కిడ్నాపర్లు ఏమీ చేయలేక అక్కడే ఉండిపోయారు. ఇంతలో పోలీసులు సింహాలను అక్కడ గుర్తించి, ఏదో తేడా కొడుతోందని భావించారు. చివరికి కిడ్నాపర్లను పట్టుకుని బాలికను రక్షించారు. 


Also Read: Disease X: దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!