Uttar Pradesh News: 


యూపీలో దారుణం..


యూపీలోని ఓ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నిద్ర పట్టడం కోసం ఓ డాక్టర్ ఫుల్‌గా ఏసీ పెట్టుకుని పడుకున్నాడు. అదే గదిలో ఉన్న ఇద్దరు శిశువులు తెల్లారే సరికి ప్రాణాలు కోల్పోయారు. ఆ చలిని తట్టుకోలేక మృతి చెందారు. షమిలీ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. చిన్నారుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మండి పడుతున్నారు. హాస్పిటల్ ఓనర్ తన సౌకర్యం కోసం ఇద్దరి చిన్నారుల ప్రాణాల్ని బలి తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులకూ ఫిర్యాదు చేశారు. సెక్షన్ 304 కింద పోలీసులు హాస్పిటల్‌ ఓనర్ డాక్టర్ నీతుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..కైరానాలోని ఓ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు శిశువులు జన్మించారు. అప్పటికప్పుడు ఫొటోథెరపీ చికిత్స అందించాల్సి వచ్చింది. వైద్యుల సూచన మేరకు అదే రోజున ఆ పసికందులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అదే గదిలో రాత్రి నిద్రపోవడానికి వెళ్లిన డాక్టర్ ఫుల్‌గా AC పెట్టుకున్నాడు. తెల్లారి లేచి చూసే సరికి ఆ చిన్నారులు గడ్డకట్టుకుపోయి ప్రాణాలొదిలారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 


ప్రసూతి మరణాలు..


ప్రపంచంలో ప్రసూతి మరణాల సంఖ్య తగ్గడం లేదు. ప్రతి ఏడు సెకన్లకు ఎక్కడో ఒకచోట నవజాత శిశువు మరణించడం లేదా ప్రసవం సమయంలో తల్లి మరణించడం జరుగుతోంది. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి కావాల్సిన పెట్టుబడులను దేశాలు తగ్గించడం వల్లే ఇలా జరుగుతోందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో చెబుతోంది. ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రసవ సమయంలో లేదా ప్రసవం జరిగిన మొదటి వారంలో ఏటా 4.5 మిలియన్ల మంది పిల్లలు, శిశువులు మరణిస్తున్నట్టు సర్వేలో తెలిసింది. అంటే ప్రతి ఏడు సెకన్లకు ఒక తల్లి లేదా అప్పుడే పుట్టిన బిడ్డ మరణిస్తున్నారని అర్థం. ఈ మరణాల్లో చాలా వరకు నివారించదగినవే ఉన్నాయి, కానీ అవసరమైన ఆరోగ్య పరికరాలు, వైద్యులు అందుబాటులో లేని కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. సెప్సిస్, మెనింజైటిస్, నిమోనియా, నియోనాటల్ టెటానస్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడిన శిశువులు అధికంగా మరిణించే అవకాశం ఉంది. ప్రసవం జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ సరిగా అందక మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది కూడా నవజాత శిశువుల మరణానికి దారితీస్తుంది. కొందరు నవజాత శిశువులకు గుండె లోపాలు, నాడీ ట్యూబ్ లోపాలు పుట్టుకతో రావచ్చు. ఇవి కూడా మరణానికి దారితీస్తాయి. ఇక తల్లులు ప్రసవ సమయంలో రక్తం అధికంగా పోవడం వల్ల వారు మరణించే సంఖ్య పెరుగుతోంది. 


 Also Read: మోదీ సర్కార్‌ బాగా పని చేస్తోంది, 10కి 8 మార్కులిచ్చేయొచ్చు - ఒడిశా సీఎం ప్రశంసలు