IRDAI Key Decision Health Insurance: ఆరోగ్య బీమాకు సంబంధించి భారత భీమా నియంత్రణ.. అభివృద్ధి సాధికారిక సంస్థ(ఐఆర్‌డీఏఐ) తీసుకున్న కీలక నిర్ణయాలు బీమాదారులకు మరింత మేలు చేకూర్చనున్నాయి. ఆరోగ్య బీమా తీసుకున్న వారికి ఇప్పటి వరకు ఉన్న కొన్ని నిబంధనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తాజా నిర్ణయాలతో అనేక నిబంధనలు నుంచి మినహాయింపు లభిస్తోంది. బీమా రంగంలో పాలసీదారులకు పెద్ద పీట వేస్తూ భారత బీమా నియంత్రణ అభివృద్ధి సాధికారిక సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయో పరిమితిని తొలగించింది. దీనివల్ల ఇకపై 65 ఏళ్లు పైబడిన వారు కూడా ఆరోగ్య బీమా తీసుకకోవడానికి వీలవుతుంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే ఈ కొత్త నిర్ణయం అమలులో ఉంటుంది. ఇకపై అన్ని వయసులు వారికి సరరిపోయే ఆరోగ్య బీమా పథకాలను ఇన్సురెన్స్‌ కంపెనీలు తీసుకువస్తాయని ఐడీర్‌డీఏఐ వెల్లడించింది. 


బీమా చెల్లింపులకు ప్రత్యేక విభాగాలు


నూతన నిర్ణయం వల్ల సీనియర్‌ సిటిజన్లకు అవసరమైన సేవలను అందించాలని, బీమా చెల్లింపులకు సంబంధించిన వారి కోసమే ప్రత్యేకంగా కొన్ని విభాగాలను ఏర్పాటు చేయాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. కేన్సర్‌, గుండె, కిడ్నీ జబ్బులు, ఎయిడ్స్‌ వంటి తీవ్రమైన అరాఓగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్య బీమా పథకాలను అందించాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. ఆ వర్గాలకు ఇన్సురెన్స్‌ నిరాకరించడం ఇకపై కుదరదని బీమా కంపెనీలకు స్పష్టం చేసింది. ఆరోగ్య బీమా తీసుకున్న తరువాత వ్యాధులకు అది వర్తించడానికి ప్రస్తుతం అమలులో ఉన్న 48 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌ను 36 నెలలకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది. ఈ మార్పు రోగులకు పాలసీదారులకు ఎంతగానో మేలు చేకూర్చనుంది. 


అన్ని జబ్బులకు బీమా తప్పనిసరి


ప్రస్తుతం ఇన్సురెన్స్‌ తీసుకుంటున్న వారికి బీమా సంస్థలు కొన్ని షరతులు విధిస్తున్నాయి. ఫలానా జబ్బు గురించి తెలియజేయలేని కారణంగా ఇన్సురెన్స్‌ వర్తించడం లేదంటూ పలు ఇన్సురెన్స్‌ కంపెనీలు చెబుతున్నాయి. దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. అయితే, నూతనంగా తెచ్చిన మార్పులు పాలసీదారులకు ఈ తరహా ఇబ్బందులు నుంచి ఉపశమనం కలిగించనున్నాయి. ఎందుకంటే పాలసీదారులు తన జబ్బులు గురించి వెల్లడించినా, వెల్లడించకపోయినా బీమా తీసుకున్న 36 నెలలు తరువాత అన్ని జబ్బులకు బీమా ఇవ్వాల్సిందేనని ఇన్సురెన్స్‌ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో తీసుకున్న చికిత్స వ్యయాన్ని భరించేలా ఆరోగ్య బీమా స్కీమ్స్‌ ఉన్నాయి. దీనికి బదులుగా నిర్ణీత వ్యాధులకు నిర్ణీత బీమా సొమ్మును కంపెనీలు అందించాలని, తద్వారా పాలసీదారులకు తమ వద్ద ఉన్న బీమా పథకం గురించి ముందే స్పష్టత ఉంటుందని ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. ఇన్సురెన్స్‌ కపంఎనీలు ఈ మార్పు దిశగా క్రమంగా కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 


మారటోరియం ఐదేళ్లకు తగ్గింపు


ఆరోగ్య బీమాపై మారటోరియం వ్యవధిని కూడా తగ్గించింది. ప్రస్తుతం ఉన్న ఎనిమిదేళ్ల మారటోరియం వ్యవధిని ఐదేళ్లకు కుదించింది. ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లిస్తే బీమా పథకంలోని అన్ని సేవలను పాలసీదారులకు కంపెనీ అందించాల్సి ఉంటటుంది. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఐఆర్‌డీఏఐ తీసుకున్న నిర్ణయాలపై బీమా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలతో దేశంలో మరింత సమ్మిళిత ఆరోగ్య సేవలకు అవసరమైన వాతావరణం నెలకొంటుందని, ఇన్సురెన్స్‌ కంపెనీలు వైవిధ్యపూరిత సేవలు అందించడానికి వీలు కలుగుతుందని నిపుణులు వెల్లడించారు.