India China Tunnel: భారత్ - చైనా సరిహద్దుల్లో రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రోడ్డు సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో కొత్తగా మరో 7 సొరంగ మార్గాలను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే గత మూడేళ్ల నుంచి భారత్ ఈ ప్రాంతంలో 5 సొరంగ మార్గాల నిర్మాణాలను పూర్తి చేసింది. మరో 7 సొరంగ మార్గాలు నిర్మించాలని యోచిస్తోందని, ఇవి ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. 


2014 నుంచి మోదీ సర్కారు సరిహద్దుల్లో మౌలిక వసతుల నిర్మాణాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో కీలక చర్యలు చేపట్టింది. 2013-14 ఏడాదిలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) కు రూ.3,782 కోట్లు కేటాయించగా.. 2023-24 లో 4 రెట్లు ఎక్కువగా ఏకంగా రూ. 14,387 కోట్లు కేటాయించినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ గుర్తు చేశారు. 2008 నుంచి 2014 వరకు చైనా సరిహద్దుల్లో కేవలం 7270 మీటర్ల మేరకు మాత్రమే వంతెనలు నిర్మించారని... 2014-2022 లో ఏకంగా 22,439 మీటర్ల మేరకు పనులు జరిగినట్లు మంత్రి వెల్లడించారు. 


వీటికి అదనంగా భారత్- చైనా సరిహద్దు రాష్ట్రాలు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లో 1,800 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనని లోయల్లో నివాసం ఉండే ప్రజలు సరైన రవాణా సదుపాయాలు అందేందుకు ఈ రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నట్లు అజయ్ భట్ పేర్కొన్నారు. ఇవి సరిహద్దులతో, అంతర్గత అనుసంధానతలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. బడ్జెట్ కేటాయింపులను పెంచడం, రోడ్డు, వంతెనల నిర్మాణాలను వేగవంతం చేయడం, సరికొత్త సాంకేతికతలను అనుసంధానించడం, ఆయా నిర్మాణ పనులకు వెనువెంటనే అనుమతులు ఇవ్వడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దుల రక్షణకు కట్టుబడి ఉందన్న అంశాన్ని తెలియ జేస్తోందని తెలిపారు. చైనా సరిహద్దుల్లో అత్యంత కీలకమైన అటల్ టన్నెల్ నిర్మాణాన్ని 2020లో పూర్తి చేసిన విషయం తెలిసిందే. సెలా టన్నెల్ నిర్మాణం ఈ ఏడాది ఆగస్టులో పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే అస్సాంలోని గువహటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు ప్రయాణం మరింత సులువు, వేగంవంతం కానుంది.


Also Read: Pepperfry CEO Death: గుండెపోటుతో పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మృతి


ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం


10 వేల అడుగుల ఎత్తులో చేపట్టిన అతి పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్. ఇది మనాలి లేహ్ హైవేపై రోహ్తాంగ్ పాస్ కింద నిర్మించారు ఈ సొరంగ మార్గాన్ని. ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడానికి దాదాపు పదేళ్ల కాలం పట్టింది. ఈ టన్నెల్ మార్గం ద్వారా మనాలి లేహ్ మధ్య దూరం సుమారు 46 కిలోమీటర్ల తగ్గింది. రూ.3,500 కోట్ల వ్యయంతో 9.02 కిలో మీటర్ల పొడవున నిర్మించారు. శీతాకాలంలో మంచు కురిసినప్పటికీ ఈ రోడ్డును మూసివేయాల్సిన పని ఉండదు. ఈ సొరంగ మార్గం సైనికుల రాకపోకలకు కూడా వ్యూహాత్మకంగా ఉంటుంది.