దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 30 వేల దిగువకు పోయిన కరోనా కేసులు తాజాగా 38 వేలకు ఎగబాకాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.20 కోట్లను చేరింది. తాజాగా 40,013 మంది కరోనా బాధితులు కోలుకోగా, ఇప్పటి వరకు 3,12,20,981 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. అయితే, మన దేశంలో కొత్త మ్యుటెంట్‌ల ముప్పు ఉందని పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.


కరోనా సోకి కొత్తగా 497 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా 4,29,179 మంది చనిపోయినట్లయింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,86,351గా ఉన్నాయని, 140 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని బులెటిన్‌లో వివరించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటిదాకా మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. వారంలో పాజిటివిటీ రేటు 2.34శాతానికి, రోజువారీ 2.16 శాతానికి చేరుకుతుందని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 48.50 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


తెలంగాణలో కేసులివీ..
మరోవైపు, తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుతూ వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో 494 క‌రోనా కేసులు గుర్తించినట్లుగా తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరగా.. మరో 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో 8,112 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ముగ్గురు మృతిచెందారు. దీంతో తెలంగాణ‌లో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,831కి చేరింది. గత ఒకరోజులో తెలంగాణ‌లో 621 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.


ఏపీలోనూ తగ్గుతున్న కరోనా కేసులు
ఏపీలో కూడా క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి. తాజాగా ఏపీలో 63,849 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా, 1,461 మందికి పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు 2,53,11,733 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఏపీ ఆరోగ్యఃశాఖ తెలియ‌జేసింది. మొత్తం న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. ఇందులో 19,52,736 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు, రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కేసులు 18,882 గా ఉన్నాయి. 


రాష్ట్రంలో కరోనాతో ఒకే రోజులో 15 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వ‌ర‌కు రాష్ట్రంలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 13,564 కి చేరింది. అత్యధికంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 210, చిత్తూరులో 195, గుంటూరులో 182, నెల్లూరులో 195, ప్రకాశం జిల్లాలో 112 కేసులను గుర్తించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 2,113 మంది కోలుకున్నట్టుగా ఆరోగ్య ఆంధ్ర ట్విటర్‌లో పేర్కొన్నారు.