IIT Madras patent use of Indian spices to treat cancer: న్యూఢిల్లీ: వైద్య శాస్త్రానికి ఎదురైన సమస్యలలో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ప్రతి ఏడాది పలు రకాల క్యాన్సర్ వ్యాధితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Madras) పరిశోధకులు నడుం బిగించారు. క్యాన్సర్ చికిత్సకు దేశంలో లభించే మసాలా దినుసులను వినియోగించేందుకు పేటెంట్ పొందారు. వీటి ద్వారా తయారు చేసే క్యాన్సర్ మెడిసిన్ సహా ఇతర వ్యాధుల మెడిసిన్ 2028 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రావొచ్చని అధికారులు తెలిపారు.


మసాలా దినుసులతో నానోమెడిసిన్ తయారీ.. 
భారతీయ మసాలా దినుసులతో తయారుచేసిన నానోమెడిసిన్ ఇదివరకే ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము, పెద్దప్రేగు, గర్భాశయ, నోటి క్యాన్సర్,  థైరాయిడ్ సమస్యలకు వ్యతిరేకంగా పనిచేసి క్యాన్సర్ నిరోధక చర్యల్ని చూపించాయి. ప్రపంచంలో మసాలా దినుసుల ఉత్పత్తిలో మన దేశంలో అగ్రస్థానంలో ఉంటుంది. కనుక ఈ మసాలాలతో తయారు చేసే నానోమెడిసిన్ల సాయంతో క్యాన్సర్ కు మెడిసిన్ తయారు చేయాలని ఐఐటీ మద్రాస్ రీసెర్చర్స్ భావిస్తున్నారు. జంతువులపై ఇటీవల చేసిన ప్రయోగాలు ఓ మోస్తరు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. పూర్తి స్థాయిలో ప్రయోగం సక్సెస్ అయితే.. 2027-28 నాటికి మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే మెడిసిన్ అందుబాటులోకి రానుంది. క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే మొదలుపెట్టేందుకు రీసెర్చర్స్ పేటెంట్ తీసుకున్నారు.


భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలను వైద్య ప్రయోజనాలు ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నామని.. ఐఐటీ మద్రాస్‌కు చెందిన కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఆర్ నాగరాజన్ పీటీఐకి తెలిపారు. వాటి ప్రయోజనాలను విస్తృతం చేయడానికి, నానో-ఎమల్షన్ రూపంలో నిక్షిప్తం చేసి ప్రయోగం చేయనున్నారు. క్యాన్సర్ కణాలలో ఉండే క్రియాశీలక పదార్థాలను గుర్తిస్తూనే, మరోవైపు జంతువులపై ట్రయల్స్ నిర్వహించి సానుకూల ఫలితాలు రాబడతామని ధీమా వ్యక్తం చేశారు. పేటెంట్ పొందిన యాంటీ క్యాన్సర్ నానో ఫార్ములేషన్స్‌పై జంతు అధ్యయనాలు జరిగాయని, అంతా ఓకే అయితే మరో మూడు, నాలుగేళ్లలో క్యాన్సర్ కణాల్ని అంతం చేసే మెడిసిన్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.


నిధులు సమకూర్చిన గోపాలకృష్ణన్ 
ఐఐటీ మద్రాస్ (IIT Madras) పూర్వ విద్యార్థి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు గోపాలకృష్ణన్ ప్రతిక్ష ట్రస్ట్ ద్వారా నిధులు ఇచ్చి సహకరించారు. దాంతో మోతాదు (GLP దశ), సమర్థత అధ్యయనాలు (non-GLP phase) జంతువులపై నిర్వహించారు. క్యాన్సర్ చికిత్స కంటే నానో ఆంకాలజీతో పలు ప్రయోజనాలు ఉన్నాయని నాగరాజన్ తెలిపారు. దీని ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు పేషెంట్లపై అంత దుష్ప్రభావం ఉండదు. అందుకే భారత మసాలా దినుసులు (Indian spices)పై పేటెంట్ తీసుకున్నారు.


జంతువులపై మెరుగైన ఫలితాలు.. 
పేటెంట్ పొందిన భారతీయ మసాలాల ఆధారిత నానో ఫార్ములేషన్‌లు ఇన్-విట్రో అధ్యయనాల ద్వారా పలు రకాల క్యాన్సర్‌లలో మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఐఐటీ మద్రాస్‌ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ (క్యాన్సర్ నానోమెడిసిన్ & డ్రగ్ డిజైన్ లాబొరేటరీ) జాయిస్ నిర్మల తెలిపారు. జంతువుల శాంపిల్స్ పై ట్రయల్స్ సక్సెస్ అవుతున్నాయని.. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నానోమెడిసిన్ ద్వారా చికిత్సకు ఖర్చు తగ్గడంతో పాటు పేషెంట్ కు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. మసాలా నూనెలు, దినుసులు శరీర అవయాలను ప్రభావితం చేస్తాయి. కనుక వీటితో మెడిసిన్ అంటే క్యాన్సర్ రోగులకు ప్రయోజనం ఉంటుదని నిర్మల చెప్పారు. నానో ఫార్ములేషన్స్ పెరిగడంతో.. క్లినికల్ ట్రయల్స్, ఫేజ్ II, ఫేజ్ III క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం.. ఏడాదికి 4,00,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ మరణాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది పెరిగిపోతున్నాయి. వీటిలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్‌ కేసులు అధికం. క్యాన్సర్ కు 1930 నుంచి కీమోథెరపి చికిత్స చేస్తున్నారు. కానీ ఖర్చు అధికం కనుక, క్యాన్సర్ లాంటి వ్యాధుల చికిత్సలో  నానోమెడిసిన్ పాత్ర కీలకం అని చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ జాయిస్ నిర్మల వివరించారు.