Civil Aviation Minister Kinjarapu Ram Mohan Naidu React On Hoax Bomb Threats : ఆదివారం దాదాపు 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీని కారణంగా  సర్వీసులకు భారీ అంతరాయం ఏర్పడింది. విమానాలను ప్రత్యేక ప్రదేశానికి తరలించి అక్కడ తనిఖీలు చేయాల్సి వచ్చింది. ఇంతలో ఆ విమానంలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సరైన సమయానికి విమానాలు గమ్యస్థానానికి చేరుకోలేకపోయాయి. తనిఖీలు పూర్తి చేసిన తర్వాత అసలు బాంబులాంటివి ఏమీ లేవని వచ్చింది ఫేక్ కాల్ అని తేలింది. 


ఇదే మొదటిసారి కాదు. వారం రోజుల నుంచి ఇలాంటి ఫేక్ బాంబు కాల్స్ వందకుపైగా వచ్చాయని విమానాయశాఖాధికారులు చెబుతున్నారు. వచ్చిన ప్రతి కాల్‌ను సీరియస్‌గా తీసుకుంటున్న అధికారులు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని తేలుస్తున్నారు. చేసిన కాల్స్ అన్ని కూడా ఫేక్‌ అని నిర్దారిస్తున్నారు. 


ఆదివారం బెదిరింపు కాల్స్ వచ్చిన విమానాల్లో ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్ నుంచి ఒక్కో సంస్థకు చెందిన ఆరు విమానాలతోపాటు ఎయిరిండియా విమానం ఉంది. ఇండిగోలో 6E 58 (జెడ్డా నుంచి ముంబై), 6E87 (కోజికోడ్ నుంచి దమ్మమ్‌), 6E11 (ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్), 6E17 (ముంబై నుంచి ఇస్తాంబుల్), 6E133 (పూణె నుంచి జోధ్‌పూర్) 6E112 (గోవా నుంచి అహ్మదాబాద్‌)విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనిఖీలు చేసిన అధికారులు ఎలాంటి  బాంబులు లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయా విమానాలు ప్రయాణికులతో సురక్షితంగా గమ్యస్థానాల్లో దిగినట్లు అధికారులు తెలిపారు. 


విస్తారాలో ఆరు విమానాలకు బెదిరింపులు వచ్చాయి: UK25 (ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్), UK106 (సింగపూర్ నుంచి ముంబై), UK146 (బాలీ నుంచి ఢిల్లీ), UK116 (సింగపూర్ నుంచి ఢిల్లీ), UK110 (సింగపూర్ నుంచి పూణే), UK107 (ముంబయి నుంచి సింగపూర్). ఈ బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు ప్రోటోకాల్‌లకు అనుగుణంగా, అన్ని సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేశారు. అనంతరం వాళ్లు నిర్దేశించినట్లుగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. 


అకాసా ఎయిర్ లైన్స్‌కు సంబంధించిన ఆరు విమానాలకి కూడా బెదిరింపులు వచ్చాయి. అవి QP1102 (అహ్మదాబాద్ నుంచి ముంబై), QP1378 (ఢిల్లీ నుంచి గోవా), QP1385 (ముంబై నుంచి బాగ్‌డోగ్రా), QP1406 (ఢిల్లీ నుంచి హైదరాబాద్), QP1519 (కొచ్చి నుంచి ముంబై), QP1526 (లక్నో నుంచి ముంబై). 


ఎయిర్ ఇండియా విమానాలు కూడా ప్రభావితమైనట్లు సమాచారం, అయితే ఎయిర్‌లైన్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేయలేదు. కొచ్చి నుంచి దమ్మమ్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం ఐఎక్స్‌481కి బాంబు బెదిరింపు వచ్చినప్పటికీ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని పిటిఐ వర్గాలు వెల్లడించాయి. వివిధ విమానాలకు బాంబు బెదిరింపు సమాచారం పెట్టిన సోషల్ మీడియా ఖాతాను బ్లాక్ చేశారు. 


ఫేక్ కాల్స్‌తో గందరగోళపరచడానికి ఒక వ్యక్తే ఇదంతా చేస్తున్నాడని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు అనుమానపడ్డారు. ఇలాంటి కాల్స్‌పై మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు చెప్పారు. కాల్స్ చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. "గత వారం నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. మంత్రిత్వ శాఖ ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కేసులు కూడా రిజిస్టర్ చేశాం. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు" అని రామ్మోహన్ నాయుడు ANI కి చెప్పారు.


ఈ బూటకపు కాల్స్‌ వెనుక ఉద్దేశం గురించి అడిగితే... రామ్మోహన్ ఇలా కామెంట్ చేశాడు. "ఈ సమయంలో దాని గురించి చెప్పడం చాలా కష్టం. పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు ఈ సమస్య వెనుక ఉన్న నేరస్థులను పట్టుకోవాలి. వారిని గుర్తించిన తర్వాత వారి ఉద్దేశాలు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది." అని అన్నారు. 


ఒకే వ్యక్తి వివిధ విమానాల గురించి ట్వీట్ చేసి గందరగోళాన్ని సృష్టించడానికి కారణమవుతున్నట్లు కనిపిస్తోందని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. "ట్విటర్ (X)లో ఒక వ్యక్తి మాత్రమే ఇలాంటి పోస్టులు పెట్టాడు. అనేక విమానాల గురించి ట్వీట్ చేశాడు. దీంతో మొత్తం వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు."


భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇతర ముఖ్య సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నామన్నారు రామ్మోహన్. "మేం దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలనుకుంటున్నాం" అని ఆయన పోస్టు పెట్టారు. బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని తెలిపారు. 


బెదిరింపులకు ప్రతిస్పందనగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) శనివారం ఎయిర్‌లైన్ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఫేక్‌ బెదిరింపు కాల్స్‌ను అరికట్టడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. నేరస్థులను నో-ఫ్లై జాబితాలో ఉంచడం కూడా ఇందులో ఒకటి. 


Also Read: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదన