Himachal CM Hospitalised: 


సుఖ్వీందర్ సింగ్‌కి అస్వస్థత..


హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు అస్వస్థతకు గురయ్యారు. షిమ్లాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ AIIMSకి తరలించారు. కడుపులో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన అస్వస్థకు గురైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. సుఖ్వీందర్ సింగ్ సుకు పాంక్రియాసిస్‌తో బాధ పడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్యులు ఇప్పటికే ఆయనకు అన్ని పరీక్షలు చేశారు. అన్ని రిపోర్ట్‌లు నార్మల్‌గానే ఉన్నట్టు వివరించారు. ఈ టెస్ట్‌ల్లోనే ఆయనకు ప్రాంకియాసిస్ ఉన్నట్టు తేలింది. పొత్తి కడుపులో తీవ్రంగా నొప్పి రావడం వల్ల హుటాహుటిన షిమ్లాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే..సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం మంచిదని అక్కడి వైద్యులు సలహా ఇవ్వడం వల్ల ఢిల్లీ ఎయిమ్స్‌కి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి మీడియా సలహాదారు నరేశ్ చౌహాన్ కీలక విషయాలు వెల్లడించారు. కొద్ది రోజులుగా సుఖ్వీందర్ సింగ్ సుకు వరుస పర్యటనలతో బిజీగా ఉన్నట్టు చెప్పారు. బయటి ఫుడ్‌ తినడం వల్ల ఇన్‌ఫెక్షన్ అయిందని వివరించారు. కొద్ది రోజుల పాటు బెడ్‌రెస్ట్‌ తీసుకోవాలని వైద్యులు సూచించారు. హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉంచారు.