ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రంప్రభుత్వం దసరా, దీపావళి కానుక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. డియర్నెస్ అలవెన్స్ను 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు.


2023, అక్టోబర్ 18, బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో డియర్నెస్ అలవెన్స్ పెంపునకు ఆమోదం తెలిపింది. డియర్నెస్ అలవెన్స్ పెంపుతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతం ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతంతోపాటు జూలై నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలు కూడా ఇయ్యవచ్చు.


అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 24న దసరా. 2023 నవంబర్ 12న దీపావళి. ఇలాంటి పరిస్థితుల్లో పండుగ సీజన్లో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్నెస్ అలవెన్స్ను పెంచాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.


ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం
కరువు భత్యం పెంపుతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుంచి గొప్ప ఉపశమనం లభించనుంది. ఇటీవలి కాలంలో ఆహార ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ లో 5.02 శాతానికి తగ్గింది. అంతకుముందు 2023 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.44 శాతానికి చేరుకుంది. ఆగస్టులో 9.94 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 6.56 శాతానికి తగ్గింది. కానీ గోధుమలు, బియ్యం, కందిపప్పు, పంచదార ధరలు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డియర్నెస్ అలవెన్స్ పెంపుతో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.