Delhi Farmers Protest : తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అన్నదాతలు చలో ఢిల్లీ (Chalo Delhi) కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల ఆందోళన వేళ.... కేంద్ర ప్రభుత్వం (Central Government)కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ (Punjab) రాష్ట్రానికి సరఫరా చేసే డీజిల్ (Diesel)లో 50 శాతం సరఫరాను తగ్గించేసింది. అదే విధంగా గ్యాస్ (Gas)ను 20 శాతం తగ్గించి పంపినట్లు  ప్రభుత్వ వర్గాల సమాచారం.  ప్రధాన డిమాండ్లు నెరవేర్చే వరకు దేశ రాజధానిని వీడకూడదని అన్నదాతలు నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునే లక్ష్యంతో ఢిల్లీ దిశగా అన్నదాతలు కదిలారు. పంజాబ్‌, హరియాణా నుంచి వేల మంది రైతులు ట్రాక్టర్లతో నగరానికి బయల్దేరారు. పంజాబ్ నుంచే వేల సంఖ్యలో ట్రాక్టర్లు, వాహనాలు బయల్దేరాయి. ఆరు నెలలకు సరిపడా ఆహారం, ఇతర సామగ్రిని ట్రాక్టర్లలో సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరేవరకు నిరసన కొనసాగించేందుకు రెడీ అయ్యారు. రైతుల యాత్రను భగ్నం చేసేందుకు ట్రాక్టర్లకు డీజిల్ దొరక్కుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. 


ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్‌
రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర సరిహద్దుల్లో భారీగా బలగాలను భారీగా మోహరించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల కాంక్రీట్‌ బ్లాక్స్‌, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. హస్తిన అంతటా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్‌ సమీపంలో ఉన్న సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. గాజీపుర్‌, చిల్లా సరిహద్దుల్లోని హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. ట్రాఫిక్‌ కు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కిలోమీటరు దూరానికే గంటకు పైగా సమయం పడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 2020-21లో ఉద్యమించిన రైతులు పలువురు ప్రస్తుత ఆందోళనలో పాల్గొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో చలిని లెక్క చేయకుండా నిరసన చేపట్టారు. గతం ఇచ్చిన హామీలను సాధించుకున్నాకే తిరిగి వెనక్కివెళతామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.


రైతుల ప్రధాన డిమాండ్లు ఏమిటంటే ?
పంటకు కనీస మద్దతు ధర కల్పించాలన్నది రైతుల ప్రధానమైన డిమాండ్. మార్కెట్‌ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా...కనీస మద్దతుధర భరోసా కల్పిస్తూ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వివాదాస్పద విద్యుత్‌ చట్టం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే.. తమకు అందే రాయితీని కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  2020-21లో ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూసేకరణ చట్టం 2013ని పునఃవ్యవస్థీకరించడం, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వైదొలగడం వంటి డిమాండ్లను కేంద్రం ముందుంచారు. కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. కనీస మద్దతు ధర, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీకి సంబంధించి చట్టపరమైన హామీలు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదనకు రైతు సంఘాల నాయకులు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.