Eid-ul-Adha Bakrid 2023:



ముంబయిలోని సొసైటీలో గొడవ..


బక్రీద్‌ పండుగ ముందు ముంబయిలో ఓ హౌజింగ్ సొసైటీలో హిందువులు, ముస్లింల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వచ్చి మరీ అక్కడి పరిస్థితులు అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. సాధారణంగా ముస్లింలు బక్రీద్‌ పండుగకు ఓ మేకను బలి ఇస్తారు. ఇందుకోసం ఓ ముస్లిం కుటుంబం రెండు మేకల్ని తమ ఫ్లాట్‌కి తీసుకొచ్చింది. లిఫ్ట్‌లో వాటిని తీసుకురావడాన్ని చూసిన మిగతా వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మోసిన్ షేక్‌ కుటుంబంపై మండి పడ్డాయి. అంతే కాదు. అపార్ట్‌మెంట్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. హిందువులు ఒక్కసారిగా అక్కడికి వచ్చి హనుమాన్ చాలిసా చదవడం మొదలు పెట్టారు. ఇది కాస్తా స్థానికంగా అలజడి సృష్టించింది. ఆ తరవాత బజ్‌రంగ్ దళ్ కూడా అక్కడికి వచ్చింది. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చారు. ఆ రెండు మేకల్నీ స్వాధీనం చేసుకున్నారు. సొసైటీలో మేకల్ని బలి ఇవ్వడానికి వీల్లేదని హిందువులు తేల్చి చెప్పారు. పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి రెండు వర్గాలకూ నచ్చజెప్పారు. దీనిపై ఆ ముస్లిం కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పండుగను ప్రశాంతంగా జరుపుకోకుండా అడ్డుకున్న వారిపై ఫిర్యాదు చేసింది. ఈ సొసైటీలో దాదాపు 250 ముస్లిం కుటుంబాలుంటున్నాయని, వాళ్లందరికీ ఇలాంటి పండుగలు జరుపుకునేందుకు బిల్డర్ అనుమతినిచ్చాడని బాధితుడు మోసిన్ షేక్ స్పష్టం చేశాడు. 


"ఈ సొసైటీలో వందలాది ముస్లిం కుటుంబాలున్నాయి. ఏటా బక్రీద్ జరుపుకునేందుకు, మేకల్ని బలి ఇచ్చేందుకు ప్రత్యేకంగా మాకు ఓ స్పేస్ ప్రొవైడ్ చేశారు. కానీ ఈ సారి మాత్రం మాకు అనుమతినివ్వలేదు. మిగతా ఫ్యామిలీస్‌తో మాట్లాడుకోవాలని చెప్పాడు. అంతే కాదు. మేకల్ని ఇంటికి తీసుకురావడాన్నీ అనుమతించలేదు. అసలు ఈ సొసైటీ ప్రాంగణంలో మేకల్ని బలి ఇవ్వాలన్న ఆలోచన మాకు లేనే లేదు"


- మోసిన్ షేక్ 


బలి ఎందుకు..?


ఇస్లాం మ‌త పెద్ద‌ల‌ అభిప్రాయం ప్రకారం, ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం మొహమ్మద్ తనను తాను దేవుని ఆరాధనకు అంకితం చేసుకున్నాడు. అతని ఆరాధన పట్ల అల్లా ఎంతగానో సంతోషించాడు. ఒకరోజు అల్లా ప్రవక్త హజ్రత్ ఇబ్రహీంను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఇబ్రహీం వద్దకు వచ్చి, నీకు అత్యంత ప్రియమైన లేదా అత్యంత విలువైన వస్తువును త్యాగం చేయమని అడిగాడు, అప్పుడు ఇబ్రహీం తన సొంత కుమారుడిని బలి ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అప్పుడు అల్లా ఇతను నీ కుమారుడు క‌దా అని అడిగాడు. అప్పుడు ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం మొహమ్మద్ తన కుమారుని కంటే తనకు ప్రియమైనది కానీ, విలువైనది కానీ ఏదీ లేదని చెప్పాడు. అత‌న్ని త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. అతను తన కొడుకును బలి ఇవ్వాలనుకున్న వెంటనే, అల్లా ఇబ్రహీం కొడుకు స్థానంలో ఒక గొర్రెను ఉంచాడు, అత‌ని కుమారుడిని మళ్లీ అతనికి అప్పగించాడు. బలి ఇచ్చే స్థలంలో గొర్రెను చూసి ఆశ్చర్యపోయిన ఇబ్రహీం తన కొడుకు గురించి అల్లాను ఆరా తీస్తాడు. అప్పుడు, అల్లా నాపై నీ కళంకమైన భక్తిని చూసి, నేను ఓడిపోయాను. నీ భక్తికి నేను సంతోషిస్తున్నాను అని ఇబ్ర‌హీం కుమారుడిని అతని వద్దకు తిరిగి ఇస్తాడు. అప్పటి నుంచి బక్రీద్ పండుగను జరుపుకోవ‌డం మొద‌లైంది. బక్రీద్ పండుగలో గొర్రెలను బలి ఇచ్చే సంప్రదాయం పుట్టింది.


Also Read: ప్రధాని అభ్యర్థిగా మోదీయే ఫస్ట్ ఛాయిస్, సెకండ్ ప్లేస్‌లో రాహుల్ - ABP C Voter సర్వేలో తేల్చి చెప్పిన ఓటర్లు