ABP  WhatsApp

Drone War: ఇక ఆయుధాలు మాయం.. అంతా 'డ్రోన్ల' మయం

ABP Desam Updated at: 29 Jul 2021 03:53 PM (IST)

జమ్ముకశ్మీర్ లో ఇటీవల డ్రోన్ల దాడి తీవ్ర కలకలకం సృష్టించింది. ఇది మన రక్షణ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్లను గుర్తించి, నాశనం చేసే వ్యవస్థ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

డ్రోన్లు

NEXT PREV


"నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికి వస్తా.. నీ మూతిమీద మొలిసింది నిజమైన మీసమే అయితే.. రారా చూసుకుందాం కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా"-


ఇది ఓ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్. అయితే మరి ఇప్పుడు యుద్ధాలకి కత్తులు వద్దు, తుపాకీలు కాదు.. అంతకుమించి"


సరిహద్దుల మాట అటుంచి.. కనీసం గడప కూడా దాటక్కర్లేదు. ఎక్కడో నుంచొని ఆపరేట్ చేస్తే పక్క దేశాన్ని పేల్చేయొచ్చు. ఇది నేటి మోడ్రన్ వార్.. 'డ్రోన్ల' యుద్ధం.


వరుసగా..


జమ్మూలోని వైమానిక దళం స్థావరంపై ఇటీవల డేగల వంటి అజ్ఞాత డ్రోన్లు పేలుడు పదార్థాలను జారవిడవడం భద్రతా దళాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భారత్‌ అత్యాధునిక యుద్ధసామర్థ్యాలకు ఇది పరీక్ష. డ్రోన్‌ ను ముందే పసిగట్టడం లేదా కూల్చివేయడం సంగతి పక్కన పెడితే, కనీసం అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వెంటనే గుర్తించలేకపోయారు. ఆ తరవాత పలు డ్రోన్లు వివిధ సైనిక స్థావరాల సమీపంలో దర్శనమిచ్చాయి. భారత్‌ వేగంగా మేలుకోకపోతే వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పాక్‌, దాని ఉగ్రసంస్థలకు అప్పనంగా అప్పజెప్పినట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కొంతకాలంగా కశ్మీర్‌లో భారత సైన్యం వ్యూహాత్మకంగా ముందడుగు వేయడం వల్ల స్థానికులు ఉగ్రవాదం వైపు మళ్లడం కొంత తగ్గింది. ఫలితంగా పాక్‌ ఇప్పుడు డ్రోన్లపై దృష్టి పెట్టింది. భూమికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల వీటి ఆచూకీ గుర్తించడం రాడార్లకు కష్టం. చౌకగా లభించే వాణిజ్యశ్రేణి క్వాడ్‌కాప్టర్లు సైతం.. సరిహద్దుల్లోని గగనతల రక్షణ వ్యవస్థ రాడార్లు, కమ్యూనికేషన్‌ కేంద్రాలు, రాకెట్‌ లాంఛర్లను దెబ్బతీయగలవు. ఇలాంటి పరిస్థితినే అజర్‌బైజాన్‌తో యుద్ధంలో అర్మీనియా ఎదుర్కొంది.


డ్రోన్ల మయం..


2018లో వేలమంది దేశ సైనికుల ఎదుటే వెనెజువెలా అధ్యక్షుడు మడురోపై డ్రోన్‌తో హత్యాయత్నం జరిగింది. చైనా, పాక్‌, టర్కీలు డ్రోన్ల వినియోగంలో ఇప్పటికే మనకంటే చాలా ముందున్నాయి. చైనా, టర్కీ ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి డ్రోన్లను ఎగుమతి చేస్తున్నాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్‌ అల్లుడు బేరక్తర్‌ కుటుంబానికి చెందిన 'బేకర్‌' కంపెనీ డ్రోన్లు సిరియా, అర్మీనియా, లిబియాల్లో అరాచకం సృష్టించాయి. భారత స్థావరాలపై నిఘాకు ఇప్పటికే చైనా భారీ ఎత్తున డ్రోన్లను మోహరించింది. డ్రాగన్‌ అమ్ములపొదిలో చిన్నపాటి నానో డ్రోన్ల నుంచి సుదీర్ఘ సమయం గాలిలో ఎగురుతూ లక్ష్యాలను గుర్తించి దాడిచేసే లాయిటర్‌ మ్యూనిషన్ల వరకు ఉన్నాయి. 2011 ముందు కేవలం అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ మాత్రమే సాయుధ డ్రోన్లు వినియోగించాయి. పాక్‌ వద్ద సొంతంగా అభివృద్ధి చేసిన నెస్‌కామ్‌ బుర్రాక్‌ డ్రోన్‌ ఉన్నా, చైనా నుంచి వింగ్‌లూంగ్‌ శ్రేణి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది.


మనుషుల్ని మోస్తే..



  • ప్రస్తుతం డ్రోన్లను రకరకాల వ్యాపారాలకు, భద్రతకు ఇలా ఎన్నో వాటికి ఉపయోగిస్తున్నారు.

  • అమెజాన్ వంటి ఆన్ లైన్ దిగ్గజ సంస్థలు డ్రోన్లతో వస్తువలను డెలవరీ చేస్తున్నాయి.

  • చాలా దేశాల్లో లాక్ డౌన్ సమయంలో కరోనా సోకిన వారి ఇంటికి మందులను డ్రోన్లతో డెలవరీ చేశారు.

  • లాక్ డౌన్ ఆంక్షలను, భద్రతా విషయాల్లోనూ డ్రోన్లను వినియోగిస్తున్నారు.

  • అయితే డ్రోన్ల సాయంతో పక్క దేశాల్లోని రహస్య స్థావరాలు, ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడం ఆందోళన కలిగించే విషయం. పాకిస్థాన్ ఇప్పటికే ఇలాంటి పనులు చేస్తుంది. అయితే భారీ బరువులను మోసే డ్రోన్ల సాయంతో మనుషులను సరిహద్దులు దాటించే అవకాశం కూడా ఈ రోజుల్లో ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అలాంటిదే జరిగితే భద్రత పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.


ఎంత బరువు మోయగలవు..


ప్రొఫెషనల్ డ్రోన్లు లేదా హెవీ లిఫ్టింగ్ డ్రోన్లు దాదాపు 40 lbs (18 కేజీ)ల బరువు మోయగలవు. అయితే 2017లో గ్రిఫ్ ఏవియేషన్ అనే డ్రోన్ల కంపెనీ గ్రిఫ్ 300 మోడల్ యూఏవీ డ్రోన్ ను తయారు చేసింది. ఇది దాదాపు 500 lbs (226 కేజీ)ల బరువున్న పేలోడ్ ను మోసుకెళ్లగలదు. ఈ నేపథ్యంలో భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. డ్రోన్ల తయారీ, కొనుగోలుపై ఎక్కవ దృష్టి పెట్టాలని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే మోడ్రన్ యుద్ధంలో భారత్ వెనుకబడిపోయే ప్రమాదం లేకపోలేదు.

Published at: 16 Jul 2021 04:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.