Marital Rape: మారిటల్ రేప్ (భార్యతో బలవంతపు శృంగారం)పై దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పులో వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో తాము ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు పిటిషర్లకు అనుమతి ఇచ్చింది బెంచ్‌. 






భిన్నాభిప్రాయాలు


మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేసిన దిల్లీ హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించారు. వైవాహిక జీవితంలో భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తోన్న జస్టిస్‌ రాజీవ్‌ షక్దేహర్‌ ఆదేశాలు ఇచ్చారు. 


అయితే బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ సీ హరిశంకర్‌ మాత్రం ఆ ఆదేశాలతో విభేదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 19, 21లను సెక్షన్‌ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందన​డానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని, కాబట్టి భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదన్నారు. ఈమేరకు జస్టిస్‌ రాజీవ్‌ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదంటూ పేర్కొన్నారు. దీంతో భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్లయ్యింది.


సుప్రీం కోర్టుకు


ఐపీసీలోని అత్యాచార సెక్షన్‌-375 నుంచి మారిటల్‌ రేప్‌నకు మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలతో దిల్లీ హైకోర్టులో 2015లో తొలి పిటిషన్ దాఖలైంది. అనంతరం పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లకు కౌంటర్‌గా.. పురుష హక్కుల సంఘాలు కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించకూడదనే ఆ పిటిషన్‌లో కోరాయి పురుష హక్కుల సంఘాలు. 


ఈ పిటిషన్లపై 2022 జనవరి నుంచి రోజూవారీ వాదనలు జరిగాయి. చివరికి తీర్పును ఫిబ్రవరి 21వ తేదీన రిజర్వ్‌లో ఉంచింది కోర్టు. అయితే మారిటల్‌​ రేప్‌ నేరం కాదంటూ సుప్రీం కోర్టు కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చింది. బుధవారం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువడటంతో పిటిషనర్లు సుప్రీంకు వెళ్లే అవకాశం ఇచ్చింది దిల్లీ హైకోర్టు.


Also Read: Assam CM Says PM Amit Shah: అమిత్ షాను ప్రధానిని చేసిన అసోం సీఎం! మోదీకి ఏ పోస్ట్ ఇచ్చారంటే?


Also Read: Sri Lanka Crisis: శ్రీలంకకు భారత్‌ తన బలగాలు పంపిస్తుందా? వార్తల్లో నిజమెంత?