Delhi Elections 2025: ఫిబ్రవరి 5, 2025న దేశ రాజధానిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు నిర్వహించిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 1521 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 981 మంది అభ్యర్థులు ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వెల్లడించింది. ఈ నామినేషన్ పత్రాల పరిశీలన నేడు జరగనుండగా.. అభ్యర్థిత్వ ఉపసంహరణకు జనవరి 20 చివరి తేదీగా నిర్ణయించారు. భారత ఎన్నికల సంఘం ప్రకారం, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 17. ఆ రోజున మొత్తం 680 నామినేషన్లు దాఖలయ్యాయి. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో గరిష్ట సంఖ్యలో నామినేషన్ పత్రాలు దాఖలు కావడం గమనార్హం. ఒక్క సీటు కోసం మొత్తం 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని ఎన్నికల సంఘం తెలిపింది.
ఢిల్లీ స్థానం కోసం ఆప్ తరపు నుంచి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తుండగా.. ఆయనతో పాటు మరో ఇద్దరు - ఇద్దరు మాజీ ఢిల్లీ సీఎంల కుమారులు అంటే బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు), కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కుమారుడు) కూడా ఆయనకు పోటీ చేస్తున్నారు. ఇకపోతే కస్తూర్బా నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు మొత్తం 9 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సీటు కోసం ఆప్ నుంచి రమేశ్ పహల్వాన్, బీజేపీ నుంచి నీరజ్ బసోయా, కాంగ్రెస్ తరఫున అభిషేక్ దత్ బరిలో నిలిచారు. కల్కాజీ స్థానం నుండి మొత్తం 18 మంది అభ్యర్థులు 28 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిషి.. బీజేపీకి చెందిన రమేష్ బిధురి, కాంగ్రెస్ నేత అల్కా లాంబాపై పోటీ చేస్తున్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 2013 నుంచి పట్పర్గంజ్ స్థానానికి పోటీ చేస్తుండగా, ఈ సారి జరిగే ఎన్నికల్లో జంగ్పురా అసెంబ్లీ నుంచి పోటీ చేయడం గమనార్హం. జంగ్పురాకు మొత్తం 12 మంది అభ్యర్థుల నుంచి 19 నామినేషన్ పత్రాలు వచ్చాయి.
భారత ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం సెంట్రల్ ఢిల్లీలో 99 అభ్యర్థులు మొత్తం 154 నామినేషన్లు వేశారు. తూర్పు ఢిల్లీలో 79 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు దాఖలు చేశారు. అనేక నియోజకవర్గాలను కలిగి ఉన్న న్యూఢిల్లీలో 85 మంది అభ్యర్థుల నుండి మొత్తం 135 నామినేషన్లను స్వీకరించారు.
పెరిగిన ఎన్నికల పోరు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, దేశ రాజధానిలో ఎన్నికల పోరు కూడా తీవ్రమవుతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ అనే మూడు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఈ అసెంబ్లీ భారత కూటమిలో చీలికకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా ఢిల్లీ వరుసగా 15ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. గత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో ఆప్ 70స్థానాలకు గానూ 62 సీట్లను గెలుచుకుని ఆధీక్యంలో ఉండగా.. బీజేపీ మాత్రం 8సీట్లతోనే సరిపెట్టుకుంది. ఇకపోతే ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read : Canada PM: కెనడా ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీ, నామినేషన్ దాఖలు చేసిన చంద్ర ఆర్య