Teen Girl Heart Attack: 


గుజరాత్‌లో ఘోరం..


గుజరాత్‌లో ఓ 15 ఏళ్ల బాలిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. అమ్రేలిలో బాలిక పరీక్ష రాసేందుకు ఎగ్జామ్‌ సెంటర్‌కి వెళ్లింది. సరిగ్గా హాల్‌లోకి వెళ్లే ముందే ఉన్నట్టుండి కుప్ప కూలింది. రాజ్‌కోట్‌కి చెందిన సాక్షి రజొసర 9వ తరగతి చదువుతోంది. శాంతబా గజేరా స్కూల్‌లో ఎగ్జామ్‌ హాల్‌లోకి ఎంటర్ అయ్యే ముందు కింద పడిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం హాస్పిటల్‌కి తరలిచింది. కానీ అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆమె మరణానికి కారణమేంటో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పోస్ట్‌మార్టం కోసం పంపారు. అయితే...స్కూల్‌లో ఆమె ఎగ్జామ్‌ హాల్ ముందు కుప్ప కూలిపోయిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోని కూడా విచారణ కోసం పరిశీలిస్తున్నారు. హఠాత్తుగా అలా కింద పడిపోయిందంటే..కచ్చితంగా అది గుండెపోటే అయ్యుంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రాథమికంగా అది హార్ట్‌అటాక్‌గానే నిర్ధరించారు. గుజరాత్‌లో ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలాగే గుండెపోటు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా దసరా సందర్భంగా జరిగిన గార్బా ఉత్సవాల్లో (Garba Celebrations) డ్యాన్స్ చేస్తూ హార్ట్ అటాక్‌తో చనిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ తరవాత కూడా కొంత మంది గుండె నొప్పితో బాధ పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్యమంత్రి రుషికేష్ పటేల్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కార్జియాలజిస్ట్‌లూ పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ఇలా చనిపోయిన వాళ్లందరి డేటాని సేకరించి, మరణాలకు కారణమేంటో తెలుసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


ICMR రిపోర్ట్‌..


ఇటీవలే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవియ ICMR రిపోర్ట్‌ని ప్రస్తావించారు. కొవిడ్‌ సోకిన వాళ్లకు కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని గుర్తు చేశారు. కొవిడ్ సోకి తీవ్ర లక్షణాలతో ఇబ్బందులు పడ్డ వాళ్లు ఎక్కువగా వర్కౌట్స్ చేయొద్దని ICMR అధ్యయనం తేల్చి చెప్పిన విషయాన్ని వెల్లడించారు మాండవియ. మరో రెండేళ్ల పాటు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని సూచించారు. 


"ICMR ఓ అధ్యయనం చేసింది. ఈ స్టడీ ప్రకారం..గతంలో కొవిడ్‌ సోకి తీవ్ర సమస్యలతో బాధ పడిన వాళ్లు వర్కౌట్స్ ఎక్కువగా చేయకూడదు. పరిగెత్తడం, బరువులు ఎత్తడం, శరీరం బాగా అలిసిపోయేలా వ్యాయామం చేయడం లాంటివి తగ్గించాలి. కనీసం రెండేళ్ల పాటు ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలా అయితేనే గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు"


- మన్‌సుక్ మాండవియ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి


ఎవరికైనా హఠాత్తుగా గుండె ఆగిపోతే... వారి పక్కన ఉన్నవారు మళ్ళీ గుండెను కొట్టుకునేలా చేసే ప్రక్రియ CPR. దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు దీనిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి.  ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఎదురుగా ఎవరైనా స్పృహ కోల్పోయినట్టు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. గుండెపోటు వల్ల వారు పడిపోతే, ఆ వ్యక్తి వద్దకు వెళ్లి రెండు భుజాలను పట్టుకుని గట్టిగా ఊపుతూ వారిని లేపడానికి ప్రయత్నించాలి. ఎంతగా ఊపినా వారు లేవకపోతే, వారు ఊపిరి తీసుకుంటున్నారో లేదో గమనించాలి. ఊపిరి తీసుకోకపోతే వెంటనే ఆ వ్యక్తికి గాలి ఆడేలాగా చేయాలి. బిగుతైన దుస్తులు వేసుకుంటే వాటిని విప్పేయాలి. 


Also Read: Mukesh Ambani: అంబానీకి ఆగని బెదిరింపులు, ఈసారి సీరియస్‌ వార్నింగ్‌తో రెండు ఈ-మెయిల్స్‌