మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ గేదె మహిళ మెడలోని మంగళసూత్రం గొలుసును మింగేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. చివరికి పశువైద్యుడు రెండు గంటల పాటు శ్రమించి ఆ గేదెకు శస్త్రచికిత్స చేసి దాని కడుపులోని రెండు లక్షల విలువైన మంగళసూత్రం గొలుసును బయటకి తీశారు. ఈ ఘటన చూసేందుకు గ్రామంలోని వారంతా తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో జరిగింది. 


వాషిమ్ జిల్లాలోని సార్సి అనే గ్రామంలో గీతాబాయి నివాసం ఉంటోంది. ఆమె గత రాత్రి తన మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీసి పక్కనే ఉన్న ఓ పాత్రలో ఉంచింది. ఆ సంగతి మర్చిపోయి ఆ రాత్రి అలాగే పడుకుండిపోయింది. ఆమె కుటుంబ సభ్యుడు ఒకరు ఉదయాన్నే ఆ మంగళసూత్రం ఉన్న పాత్రలో సోయాబీన్ పొట్టును వేసి ఆ పాత్రను తమ బర్రె ముందు పెట్టాడు. అతి దాణాతో పాటుగా ఆ మంగళసూత్రాన్ని కూడా మింగేసింది. 


కొంత సేపటి తర్వాత గీతాబాయి తన మంగళసూత్రం విషయం గుర్తుకు వచ్చి దాన్ని ఆ పాత్రలో ఉంచినట్లుగా గుర్తు చేసుకుంది. ఆ పాత్ర దగ్గరికి వెళ్లగా అక్కడ లేదు. మంగళసూత్రం గురించి చుట్టుపక్కలతో పాటు ఇల్లాంతా వెతికినా కనిపించలేదు. దీంతో సోయా పొట్టుతో పాటుగా మంగళసూత్రాన్ని కూడా గేదె తినేసి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. 


దీంతో ఏం చేయాలో పాలుపోకపోవడంతో వెంటనే వెటర్నరీ డాక్టర్ ను సంప్రదించారు. జరిగిన విషయం గురించి వివరించారు. పశువైద్యుడు బర్రెకు ఆల్ట్రా సౌండ్ పరీక్ష నిర్వహించగా, అందులో ఆ గొలుసు ఉన్నట్లుగా కనిపించలేదు. దీంతో కుటుంబం మొత్తంలో ఆందోళన పెరిగిపోయింది. 


మొత్తానికి డాక్టర్ ఆ గేదెకు ఆపరేషన్ చేసి గొలుసును బయటికి తీశారు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా శ్రమించి బంగారు గొలుసును డాక్టర్ బయటికి తీశారు. మొత్తానికి గేదెకు 60 నుంచి 65 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆ గేదె ఆరోగ్యంగానే ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. మొత్తానికి 2 లక్షల ఖరీదు చేసే బంగారు గొలుసు బయటికి రావడం పట్ల గీతాబాయి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.